ఎమ్మెల్యే గొట్టిపాటిపై దాడి, ఫోన్లో జగన్ పరామర్శ
హైదరాబాద్: ప్రకాశం జిల్లా కలెక్టరేట్లో సోమవారం అద్దంకి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్పై తెలుగుదేశం పార్టీ నేతలు దాడికి దిగారు. ఈ దాడిలో రవి అనుచరుడు ఒకరు తీవ్రంగా గాయపడగా, డ్రైవర్, గన్మెన్కు స్వల్పంగా గాయాలయ్యాయి. ఎమ్మెల్యే కారును టీడీపీ వర్గీయులు పూర్తిగా ధ్వంసం చేశారు. వారి దౌర్జన్యాలను, దాడులను నిరసిస్తూ గొట్టిపాటి రవికుమార్ కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు.
వివరాల్లోకి వెళితే... గుండ్లకమ్మ రిజర్వాయర్ నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు సంబంధిత సమస్యపై ఇటీవల జిల్లా పరిషత్ సమావేశంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ నిలదీశారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ విజయకుమార్ నిర్వాసితుల అంశంపై చర్చించేందుకు కలెక్టరేట్లో సోమవారం సాయంత్రం సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశానికి రవాణా శాఖా మంత్రి శిద్ధా రాఘవరావు అధ్యక్షత వహించారు. మాజీ ఎంపీ కరణం బలరామ్, ఆయన కుమారుడు కరణం వెంకటేష్ కూడా తమ అనుచరులతో సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం పూర్తైన తర్వాత ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ను బయటకు వెళ్లనీయకుండా కరణం వర్గీయులు అడ్డుకున్నారు.
గన్మెన్ వారిని తప్పుకోమని చెప్పడంతో అతనిపై దాడికి ప్రయత్నించారు. ఈలోగా అక్కడికి వచ్చిన కరణం బలరామ్, ఆయన కుమారుడు వెంకటేష్లు అనుచరులను రెచ్చగొట్టడంతో వారు రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో ఎమ్మెల్యే కారుని కూడా ధ్వంసం చేశారు.
డ్రైవర్, గన్మెన్, పీఏలను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. ఎమ్మెల్యేపై దాడిని అక్కడున్న రైతులు అడ్డుకోవడంతో కరణం వర్గీయులు అక్కడినుంచి వెళ్లిపోయారు. ఈ దాడిని నిరసిస్తూ ఎమ్మెల్యే గొట్టిపాటి కలెక్టరేట్ ముందు నిరసనకు దిగారు. తనను అడ్డు తొలగించుకోవడమే లక్ష్యంగా తనపై దాడికి దిగారని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ చెప్పారు.
గత రెండు నెలల్లో తనపై మూడుసార్లు దాడికి ప్రయత్నించినట్లు తెలిపారు. గతంలో తన అన్న గొట్టిపాటి కిశోర్ను హత్య చేశారని, ఇప్పుడు వరుసగా మూడుసార్లు తాను గెలవడంతో తనను అంతం చేసేందుకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఈ పనులన్నీ చేస్తున్నారని అన్నారు.
దీంతో ఏఎస్పీ రామానాయక్, డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, ఆర్డీవో కె.శ్రీనివాసరావు ఎమ్మెల్యేతో చర్చలు జరిపారు. ‘మీరే దగ్గరుండి చంపిస్తారా..?' అంటూ ఈ సందర్భంగా రవికుమార్ పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు మద్దతుగా వైఎస్సార్సీపీ పర్చూరు ఇన్చార్జి గొట్టిపాటి భరత్ సహా పలువురు నేతలు బైఠాయింపులో పాల్గొన్నారు.
గొట్టిపాటి రవికుమార్పై దాడికి పాల్పడిన మాజీ ఎంపీ కరణం బలరామకృష్ణమూర్తి, ఆయన తనయుడు కరణం వెంకటేష్లతో పాటు మరో 23 మందిపై ఒంగోలు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడిలో గాయపడిన మార్టూరు మండలం కోనంకి గ్రామానికి చెందిన మందపాటి సురేష్ ఫిర్యాదు మేరకు సెక్షన్ 147, 324, 427, రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే రవిపై దాడి గురించి తెలిసిన పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఫోన్లో పరామర్శించారు.