ఎన్టీఆర్ నుంచి బాబు దాకా: అర్థాంతరంగా ఊడిన టిడిపి మంత్రి పదవులు
అమరావతి: కేంద్రంలో పదవులు తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదా పార్లమెంటు సభ్యులకు కలిసి రావడం లేదు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎప్పుడు మంత్రి పదవులు చేపట్టినా పూర్తి కాలం ముగియక ముందే బయటకు వచ్చారు.
ఎన్టీ రామారావు హయాంలో నేషనల్ ఫ్రంట్ అదికారంలో ఉ్నప్పుడు, చంద్రబాబు హయాంలో యునైటెడ్ ఫ్రంట్, ప్రస్తుత ఎన్డీఎ ప్రభుత్వాల నుంచి కూడా టిడిపి మంత్రులు అర్థాంతరంగానే తప్పుకోవాల్సి వచ్చింది.
తాజాగా ఆ ఇద్దరు
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఎ ప్రభుత్వంలో మంత్రులుగా చేరిన అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి పూర్తి కాలం పదవిలో కొనసాగలేకపోయారు. ప్రత్యేక హోదా వివాదంపై వారు మధ్యలోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే, టిడిపి ఎంపీల కన్నా వీరు ఎక్కువ కాలం పదవుల్లో ఉన్నారు.
గతంలోని మంత్రులు ఇలా...
అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి మూడేళ్ల పది నెలల పాటు మంత్రి పదవుల్లో కొనసాగారు. మిగతా ప్రభుత్వాల్లో మంత్రులుగా ఉన్న టిడిపి ఎంపీలు రెండేళ్ల కన్నా ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. రాజకీయ కారణాల వల్ల గతంలోని నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ కేంద్ర ప్రభుత్వాలు కూడా పూర్తి కాలం కొనసాగలేదు.
నేషనల్ ఫ్రంట్ హయాంలో ఇలా...
లోకసభ ఎన్నికలు 1989లో ముగిసిన తర్వాత నేషనల్ ఫ్రంట్ ఏర్పడింది. నేషనల్ ఫ్రంట్లో ఉన్న టిడిపి విపి సింగ్ మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహించింది. తొలిసారి టిడిపి కేంద్రంలో మంత్రి పదవులు తీసుకుంది. ఎన్టీ రామారావు నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడు కాగా, విపి సింగ్ కన్వీనర్గా ఉన్నారు. విపి సింగ్ ప్రధానిగా నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడింది.
విపి సింగ్ మంత్రివర్గంలో ఉపేంద్ర
విపి సింగ్ ప్రభుత్వంలో టిడిపి నుంచి పర్వతనేని ఉపేంద్ర కేంద్ర మంత్రిగా ఉన్నారు. నేషనల్ ఫ్రంట్కు పూర్తి మెజారిటీ లేకపోయినప్పటికీ బిజెపి మద్దతుతో విపి సింగ్ ప్రధాని పదవిని చేపట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఏడు రాజకీయ పార్టీలతో నేషనల్ ఫ్రంట్ ఏర్పడింది. 1991లో బిజెపి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో విపి సింగ్ రాజీనామా చేశారు. దాంతో ఉపేంద్ర తన పదవిని కోల్పోయారు. ఆన దాదాపు ఏడాది పాటు పదవిలో ఉన్నారు.
చంద్రబాబు నాయకత్వంలో యునైటెడ్ ఫ్రంట్
చంద్రబాబు నాయకత్వంలో 1996లో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడింది. యునైటెడ్ ఫ్రంట్ నుంచి దేవెగౌడ ప్రధాని పదవిని చేపట్టారు. దేవేగౌడ మంత్రివర్గంలో టిడిపి నుంచి కె ఎర్రంనాయుడు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొళ్ల బుల్లిరామయ్య, ఎస్ వేణుగోపాలాచారి చేరారు.
దేవేగౌడ ఇలా రాజీనామా...
యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ హయాంలో దేవెగౌడ ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత ఐకె గుజ్రాల్ ఆ పదవిని చేపట్టారు. గుజ్రాల్ ప్రభుత్వంలో ఆ నలుగరితో పాటు రేణుకాచౌదరి కూడా మంత్రి పదవి చేపట్టారు. ఈ ప్రభుత్వానికి కాంగ్రెసు బయటి నుంచి మద్దతు ఇచ్చింది. 1998లో కాంగ్రెసు మద్దతు ఉపసంహరించుకోవడంతో గుజ్రాల్ ప్రభుత్వం పడిపోయింది. టిడిపి ఎంపీలు దాదాపు రెండేళ్ల పాటు మంత్రి పదవుల్లో ఉన్నారు.