వైసీపీలోకి ఎమ్మెల్యేల జంప్- టీడీపీ ఫిక్సయిపోయిందా ? మహానాడులో నేతల వ్యాఖ్యల వెనుక ?
ఏపీలో ప్రధాన విపక్షం టీడీపీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు వైసీపీలోకి ఫిరాయించడం ఖాయమైనట్లే కనిపిస్తోంది. మూడు రోజులుగా ఎమ్మెల్యేల ఫిరాయింపు వార్తలు షికారు చేస్తున్నా సదరు ఎమ్మెల్యేలు కానీ పార్టీ కానీ దీన్ని ఖండించకపోవడం ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా ఉంది. త్వరలో వీరు సీఎం జగన్ తో భేటీ అయి వైసీపీకి మద్దతు ప్రకటించే అవకాశాలున్నాయి.
ఫిరాయింపులపై టీడీపీ మౌనం...
ఏపీలో టీడీపీ తరఫున మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో ముగ్గురు వల్లభనేని వంశీమోహన్, మద్దాలి గిరిధర్, కరణం బలరాం ఇప్పటికే సీఎం జగన్ ను కలిసి వైసీపీకి మద్దతు ప్రకటించారు. టీడీపీకి దూరంగా కూడా ఉంటున్నారు. వీరి కోవలోనే త్వరలో మరో ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా వైసీపీకి మద్దతు ప్రకటిస్తారనే ప్రచారం తాజాగా జరుగుతోంది. అయితే సదరు ఎమ్మెల్యేలు కానీ, పార్టీ కానీ దీనిపై నోరు మెదపకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
మహానాడులో దక్కని చోటు...
ఏటా పార్టీ వ్యవస్ధాపకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నిర్వహించే పసుపు పండుగ మహానాడులోనూ వైసీపీకి వెళతారని భావిస్తున్న ఎమ్మెల్యేల్లో ఒక్క అనగాని సత్యప్రసాద్ మినహా మిగతా ఎవరికీ ప్రసంగించే అవకాశం దక్కలేదు. చివరి రోజు సాయంత్రరం లోపు సత్యప్రసాద్ హాజరుపైనా సందేహాలే. అయితే ఎమ్మెల్యేల ఫిరాయింపు ఊహాగానాలపై టీడీపీ పెద్దలు మహానాడులోనూ ఎక్కడా నోరు మెదపడం లేదు. పైగా పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్లినా కార్యకర్తలే బలమంటూ దాదాపు ప్రతీ ఒక్కరూ స్పందిస్తున్నారు. దీంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
టీడీపీ ఫిక్సయిపోయిందా ?
వైసీపీలోకి తమ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సాధారణ పరిస్ధితుల్లో టీడీపీ తీవ్రంగా స్పందించేది. కానీ ఈసారి మాత్రం అనూహ్యంగా ఎందుకో వీరి విషయంలో నోరు మెదిపేందుకు టీడీపీ అగ్రనేతలు ఇష్టపడటం లేదు. అంతే కాదు వీరికి వ్యతిరేకంగా దాదాపు ప్రతీ నేతా తమ ప్రసంగాల్లో వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీని ఎందరు వీడిపోయినా కార్యకర్తలే బలమంటూ వీరు చేస్తున్న వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఎమ్మెల్యేలు వెళ్లిపోవడం ఖాయమని టీడీపీ ఫిక్సయిపోయినట్లు అర్ధమవుతోంది.
వైసీపీ మైండ్ గేమ్ ఫలించిందా ?
టీడీపీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు వైసీపీలోకి ఫిరాయిస్తున్నారని ముందుగా అధికార పార్టీ నేతలే లీకులు ఇవ్వడం ప్రారంభించారు. మహానాడు నేపథ్యంలో టీడీపీని మైండ్ గేమ్ లోకి లాగేందుకు వైసీపీ ఈ లీకులు ఇస్తోందని తాజా పరిణామాలు కూడా స్ఫష్టం చేశాయి. సీఎం జగన్ ను తాజాగా ఇప్పటివరకూ ఒక్క టీడీపీ ఎమ్మెల్యే కూడా వచ్చి కలవలేదు. ఈ వ్యవహారంపై వైసీపీ నేతలను అడిగితే త్వరలో చేరికలు ఉంటాయని చెబుతున్నారే తప్ప ఎక్కడా స్పష్టత లేదు. కానీ టీడీపీ మాత్రం ఢిపెన్స్ లో పడినట్లు కనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే వైసీపీ మైండ్ గేమ్ ఫలించినట్లే కనిపిస్తోంది.