జాతీయపార్టీ దిశగా టిడిపి, తమిళ,కన్నడ రాష్ట్రాల్లో పోటీ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ ఓట్ల శాతం సాధించడంలో ఆ పార్టీకి ఇబ్బంది లేదు. మరో రాష్ట్రంలో ఆరు శాతం ఓట్లను సాధించాల్సి ఉంటుంది. దీని కోసం తెలుగువారి సంఖ్యా బలం అధికంగా ఉన్న తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ వంటి చోట్ల కూడా పార్టీ శాఖలు ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేయాలన్న ప్రతిపాదన ఆ పార్టీలో అంతర్గతంగా ఉంది.
ప్రాంతీయ పార్టీ ప్రతిపత్తి నుంచి జాతీయ పార్టీగా మారడానికి ముందు ఆ పార్టీ అంతర్గతంగా తన నియమావళిని సవరించుకోవాల్సి ఉంటుంది. దీని కోసం మహానాడులో తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఈ తీర్మానం ఎలా ఉంటే బాగుంటుందో అధ్యయనం చేయాలని తీర్మానాల కమిటీకి పార్టీ అధ్యక్షులు చంద్రబాబు సూచించారు.
బుధవారం సాయంత్రం ఆయన ఇక్కడ మహానాడు కమిటీలతో తన నివాసంలో సమావేశం అయ్యారు. ఏర్పాట్లపై సమీక్షించారు. వేసవి కావడంతో దానిని దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేయాలని ఆయన వారికి చెప్పారు. మహానాడులో చేయాల్సిన తీర్మానాలు, చర్చనీయాంశాలపై కూడా మాట్లాడుకున్నారు. ఇంకా ప్రభుత్వాల ఏర్పాటు కూడా జరగనందువల్ల మరీ ఎక్కువ హడావుడి చేయకుండా మహానాడు నిర్వహించాలన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది.