వేణు మాధవ్ జోస్యంలో నిజమెంత?.. అఖిలదీ అదే మాట: అలా జరుగుతుందా?
ఒకరకంగా ఇదో మైండ్ గేమ్ అనే చెప్పాలి. అటు మీడియా ముందు, ఇటు జనంలోను పదేపదే మెజారిటీ గురించి ప్రస్తావించడం ద్వారా గెలుపుపై వారు ధీమాగా ఉన్నారన్న సంకేతాలు జనంలోకి వెళ్తున్నాయి.
కర్నూలు: నంద్యాల ఉపఎన్నికను టీడీపీ మూడేళ్ల పాలనకు ప్రజలు ఇచ్చే రెఫరెండం.. 2019ఎన్నికలకు సెమీ ఫైనల్గా వైసీపీ ప్రచారం చేస్తుండటంతో.. అధికార పార్టీకి తప్పక గెలవాల్సిన అనివార్యత ఏర్పడింది. అదే సమయంలో అంతే ఆత్మవిశ్వాసంతో ఇటు టీవీల్లోను, అటు జనంలోను టీడీపీ నేతలంతా మెజారిటీ గురించే మాట్లాడుతుండటం గమనార్హం.
టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, మంత్రి అఖిలప్రియ, రెండు రోజుల క్రితం ప్రచారంలో పాల్గొన్న వేణుమాధవ్.. వీళ్లంతా ఇప్పుడు ఒకే మాట చెబుతున్నారు. నంద్యాలలో తాము గెలుపు లెక్కల గురించి ఆలోచించడం లేదని, మెజారిటీ ఎంత వస్తుందనే దానిపైనే ఫోకస్ చేశామని చెబుతున్నారు.
మైండ్ గేమ్:
అంతర్గతంగా టీడీపీలో కొంత ఆందోళన ఉన్నప్పటికీ.. అది ఏమాత్రం పైకి కనిపించకుండా ప్రత్యర్థిని మైండ్ గేమ్తో దెబ్బకొట్టడానికే ఇలా మెజారిటీ మంత్రాన్ని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఈ 'మెజారిటీ' మంత్రాన్ని అంత ప్రభావవంతంగా అఖిలప్రియ జనంలోకి తీసుకెళ్లగలుగుతున్నారా? అన్నది అనుమానమే.
కాబట్టి ఈ తరహా వ్యూహాం ఏ మేర ఫలిస్తుందన్నది ఫలితాలు వస్తే కానీ చెప్పలేం.
Recommended Video
వేణు మాధవ్ జోస్యం:
అటు సినీ నటుడు వేణు మాధవ్ కూడా టీడీపీ ప్రచారంలో దిగడం గమనార్హం. ప్రచారానికి వచ్చారా? అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు.. 'లేదు.. మెజారిటీ ఎంత వస్తుందో తెలుసుకుందామని వచ్చాను!' అంటూ సమాధానమిచ్చారు. అంత నమ్మకమేంటని ప్రశ్నిస్తే.. 'ప్రతీరోజు జగన్ అన్నేసి సార్లు చంద్రబాబు పేరు ప్రస్తావిస్తుంటే.. ఇక జనం ఆయనకు కాక మరెవరకి ఓటేస్తారు' అంటూ సెటైర్ వేశారు.
టీడీపీ ధీమా.. వైసీపీ కూడా!:
ఇలా టీడీపీ వర్గీయుల్లో 'మెజారిటీ' విశ్వాసం మెండుగానే కనిపిస్తోంది. మరోవైపు వైసీపీ మాత్రం టీడీపీని చావుదెబ్బ కొడుతామన్న ధీమాతో ఉంది. అదే ధీమాతో సార్వత్రిక ఎన్నికల సమయంలో గుప్పించే తరహా హామిలను సైతం ఉపఎన్నికలో వైసీపీ గుప్పిస్తోంది. నంద్యాలను జిల్లా చేస్తాం.. తమ ప్రభుత్వం ఆధికారంలోకి వస్తే అగ్రి గోల్డ్ బాధితులకు తామే డబ్బులు చెల్లిస్తామంటూ ప్రజల్లోకి వెళుతోంది.
తారుమారైతే జగన్కు కష్టం:
రెండేళ్లు ముందుగానే ఎన్నికల యుద్దాన్ని మొదలుపెట్టిన వైసీపీకి.. నంద్యాల ఫలితం అనుకూలంగా వస్తే అది కచ్చితంగా పార్టీకి కలిసొస్తుందని చెప్పాలి. అదే సమయంలో.. ఫలితం తారుమారైతే మాత్రం భవిష్యత్తు మీద దెబ్బ పడే ప్రమాదం లేకపోలేదు. ఇంతటి ఉత్కంఠను రేకెత్తిస్తోన్న నంద్యాల ఉపఎన్నికలో ఓటరు నాడిని పట్టుకునేదెవరో తేలాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు.