చిరంజీవిహోల్ సేల్గా అమ్మితే..పవన్ కల్యాణ్ రిటైల్గా అమ్మేందుకు సిద్దమయ్యారు:మంత్రి జవహర్
Recommended Video
పశ్చిమ గోదావరి:సినీ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి దాన్నిహోల్సేల్గా కాంగ్రెస్కు అమ్మితే...ఇప్పుడు తమ్ముడు పవన్ కల్యాణ్ రిటైల్గా జనసేనను అమ్మడానికి సిద్ధమయ్యారని మంత్రి జవహర్ దుయ్యబట్టారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో ఏర్పాటు చేసిన గ్రామ దర్శిని-గ్రామ వికాసం కార్యక్రమంలో మంత్రి జవహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కల్యాణ్ వారసత్వం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. పవన్ కల్యాణ్ ఏమైనా ప్రభాస్ లాగా లేక ఇంకొకరి లాగా ఆరడుగుల అందగాడా, ఆజానుబాహుడా అని ఎద్దేవా చేశారు.
పవన్ కళ్యాణ్ కేవలం వారసత్వం కారణంగానే పవన్ కళ్యాణ్ సినిమా హీరో అయ్యారని వ్యాఖ్యానించారు. తన అన్న నుంచి వచ్చిన వారసత్వం ద్వారానే కదా నువ్వు పైకొచ్చిందని పవన్ ను నిలదీశారు. ఊరికి ఇరవై మంది పవన్ కల్యాణ్ కన్నా అందంగా ఉన్నవాళ్లు ఉన్నారని...అయినా నువ్వు హీరో అయ్యావంటే వారసత్వం మూలంగానేనని మంత్రి స్పష్టం చేశారు.
వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడే ముందు పవన్ కల్యాణ్ ఒక్కసారి ఆలోచించాలని ఆయన హితవు పలికారు. చిరంజీవి సినిమా యాక్టర్ కాకపోతే అసలు పవన్ కల్యాణ్ ఎవరు, ఎక్కడుండేవారని మంత్రి జవహర్ పునరుద్ఘాటించారు. చిరంజీవి కుటుంబంలో తొమ్మిదో, పదో సినిమా యాక్టర్లు వచ్చారు...మరి అది సినీ వారసత్వం కాదా?...అని ఆయన నిలదీశారు. అసలు రాజకీయ వారసత్వం గురించి మాట్లాడే అర్హతే పవన్ కల్యాణ్కు లేదని మంత్రి జవహర్ తేల్చిచెప్పేశారు.