చర్చకు సిద్దమా? నిరూపించకపోతే తప్పుకుంటావా : జగన్ కు టీడీపీ సవాల్
గుంటూరు : రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏపీ సీఎం చంద్రబాబు శ్రమిస్తోన్న తీరును చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అనవసర ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ మంత్రులు మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామిగా ఉండాల్సిందిపోయి ప్రభుత్వ చర్యలను జగన్ అడుగుడగునా ఎందుకు అడ్డుకుంటున్నాడో అర్థమవడం లేదన్నారు మంత్రులు చినరాజప్ప, ప్రత్తిపాటి పుల్లారావు.
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కారణమేనని ఆరోపించారు. ఈ సందర్బంగా వీరిద్దరు మాట్లాడుతూ.. ఇన్ పుట్ సబ్సిడీపై చర్చకు సిద్దమా? అంటూ జగన్ కు సవాల్ విసిరారు. ప్రభుత్వంపై చేస్తోన్న ఆరోపణలను జగన్ నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
సొంత మీడియా ద్వారా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడితే సహించేది లేదని స్పష్టం చేశారు. రాయలసీమను రతనాల సీమగా మార్చాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, జగన్ మాత్రం కరువు సీమగా ఉండాలని కోరుకుంటున్నారని ఆరోపించారు. అసలు వైసీపీ అధినేత జగన్ కు కరువు అంటే ఏంటో తెలుసా? అని నిలదీశారు మంత్రులు. జగన్ అసత్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
కాగా, అనంతపురం రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు మంత్రులు. ఒక్క అనంతపురం జిల్లాలోనే ఇన్ పుట్ సబ్సిడీ కింద 550 కోట్ల రూపాయలు ఇచ్చామని తెలిపారు. తమతో కలిసి పర్యటనకు వస్తే జగన్ కు ఆ వివరాలు చూపిస్తామని సూచించారు.