జగన్! నీ అవినీతికి సాక్ష్యాలు చూపిస్తా, దమ్ముంటే అసెంబ్లీకి రా: దేవినేని సవాల్
అనంతపురం:రోడ్లపై ఎలా పడితే అలా మాట్లాడటం కాదు...నీకు దమ్ము, ధైర్యం ఉంటే శాసనసభకు వచ్చి ప్రశ్నించు...నీ ప్రతి ప్రశ్నకూ సాక్ష్యాలతో సమాధానమిస్తామని ప్రతిపక్ష నేత జగన్ కు మంత్రి దేవినేని ఉమా సవాల్ విసిరారు.
అనంతపురంలో జరిగిన టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షనేత జగన్ పై విమర్శల వర్షం కురిపించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేకే జగన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ కు నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్మూ, ధైర్యం లేక అసెంబ్లీకి రాకుండా రోడ్లపై డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు.
ప్రజల పక్షాన పోరాడాల్సిన ప్రతిపక్షం వైసిపి ఆ విషయంలో పూర్తిగా విఫలమైందన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తిచేసి ప్రజల్లో విశ్వాసం నింపుతున్నామన్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి తీరుస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద నిరుద్యోగులకు నెలకు రూ. 1000లు చొప్పున భృతి అందజేసి వారికి భరోసా ఇస్తున్నామన్నారు.
ప్రాజెక్టుల విషయంలో
ఇవన్నీ చేస్తుంటే ప్రతిపక్ష నేతలు మాత్రం ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఉమ మండిపడ్డారు. పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి అని, ఈ ప్రాజెక్టు పూర్తయితే అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందుతాయన్నారు. ప్రాజెక్టుల విషయంలో ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని..అలాంటి ప్రాజెక్టుపై నిందలు వేసి ఆపాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రాజెక్ట్ వ్యయం కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంకా రూ. 2500 కోట్లు ఇవ్వాల్సి ఉండగా పదే పదే తిప్పుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజధాని లేకపోయినా,లోటు బడ్జెట్ ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు దృడ సంకల్పంతో ముందుకు సాగుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి ఉమ చెప్పుకొచ్చారు. అలాంటి ముఖ్యమంత్రిని జగన్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, కండకావరం, అహంకారంతోనే జగన్ ఇలా పిచ్చికూతలు కూస్తున్నారని దుయ్యబట్టారు.
జగన్ కుటుంబానికి
మీ అవినీతిని సాక్ష్యాధారాలతో చూపిస్తాను...దమ్ముంటే రండి అంటూ అని జగన్కు మంత్రి ఉమ సవాల్ విసిరారు. అవుకు టెండర్లలో డబ్బు కోసం ఎవరు పనులు ఆపారో తెలియదా అని ప్రశ్నించారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలు జగన్ కుటుంబానికి పదవులు కట్టబెట్టారని...అయినా కనీసం సొంతూరు పులివెందులకు కూడా నీళ్లు తీసుకెళ్లడం వారికి చేత కాలేదన్నారు. అలాంటిది ఈ రోజు తాము పులివెందులకు నీళ్లిచ్చామన్నారు. అక్కడి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, జగన్ మాత్రం మాటలు కోటలు దాటిస్తున్నారని విరుచుకుపడ్డారు.
జగన్, పవన్ రాఫెల్ గురించి ప్రశ్నించకుండా.
మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటన సందర్భంగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ జగన్ పాదయాత్ర కేవలం చంద్రబాబును విమర్శించడానికేనని మండిపడ్డారు. జగన్, పవన్కల్యాణ్లు మోదీని, బీజేపీని ఎందుకు విమర్శించడం లేదని ఆయన నిలదీశారు. దేశం అంతటా రాఫెల్ అవినీతిపై చర్చ జరుగుతుంటే...జగన్, పవన్ రాఫెల్ గురించి ప్రశ్నించకుండా...చంద్రబాబుపై బురద జల్లుతున్నారని దుయ్యబట్టారు. అయినా ఆ బురద వారికే అంటుకుంటుందని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు హయాంలోనే
రాజకీయ ప్రయోజనాల కోసం కోర్టును వాడుకోవద్దని చీవాట్లు పెట్టినా...జగన్ సిగ్గులేకుండా కేసులు వేయిస్తున్నారని మంత్రి పుల్లారావు ఆరోపించారు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి కూడా ఇలాగే చంద్రబాబుపై కేసులు వేసి అభాసుపాలయ్యారని చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు అభివృద్ధి ఆకాంక్ష ఉంటే...జగన్కు అధికార, అవినీతికాంక్ష ఉందని విమర్శించారు. చంద్రబాబు హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని మంత్రి పుల్లరావు వివరించారు. ఈనెల 29న తాడేపల్లిగూడెంలో 1.5 లక్షల మందితో ధర్మపోరాట దీక్ష నిర్వహిస్తున్నామని...తెలుగుదేశం పార్టీకి పశ్చిమగోదావరి జిల్లా అతి ప్రాముఖ్యమైనదని తెలిపారు.