గాలి కల్యాణ్ ఏదో మాట్లాడితే ...సమాధానం చెప్పి స్థాయి తగ్గించుకోలేను:మంత్రి జవహర్
అమరావతి:జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసిపి అధ్యక్షుడు జగన్, ఎమ్మెల్యే రోజా టిడిపిపై చేస్తున్న విమర్శలపై టిడిపి నేతలు, రాష్ట్ర మంత్రులు ఘాటుగా స్పందించారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో మంత్రి జవహర్ మరో మంత్రి దేవినేని ఉమతో కలసి మీడియాతో మాట్లాడారు.
గాలిని పోతేసుకొని మాట్లాడే పవన్ తన పేరును సార్థకం చేసుకుంటున్నాడని...అలాంటి పవన్ గురించి మాట్లాడి తన స్థాయిని తగ్గించుకోలేనని మంత్రి జవహర్ పవన్ పై ధ్వజమెత్తారు. అసలు పవన్ కంటే తానే గొప్ప నాయకుడినని కితాబు నిచ్చుకున్నారు. సిఎం చంద్రబాబును ఉద్దేశించి రోజా చేసిన వ్యాఖ్యలపై జవహర్ మండిపడ్డారు.జగన్ వదిలిన బాణం షర్మిళ...ఇప్పుడు వదిలేసిన బాణంలా మిగిలిపోయారని ఆయన ఎద్దేవా చేశారు.
పవన్ అంటే గాలి...గాలి కళ్యాణ్
టిడిపి ప్రభుత్వంపై చంద్రబాబు, లోకేష్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలపై మంత్రి జవహర్ తీవ్రంగా ప్రతిస్పందించారు.....‘‘పవన్ కల్యాణ్...పవన్ అంటే గాలి...గాలి వార్తలు పోగుజేసుకుని మాట్లాడే సార్థక నామధేయుడు పవన్ కళ్యాణ్. అలాంటి గాలి కల్యాణ్ ఏదో మాట్లాడితే వాటికి సమాధానం చెప్పి నా స్థాయిని తగ్గించుకోలేను...నా సమయం వృధా చేసుకోలేను''...అని రాష్ట్ర మంత్రి కె.ఎస్ జవహర్ అన్నారు. అసలు పవన్ కళ్యాణ్ కంటే తానే గొప్ప నాయకుడినని జవహర్ చెప్పుకొచ్చారు.
రోజా...శూర్పణఖ పాత్ర
రాజకీయాల్లో రోజా శూర్పణఖ పాత్ర పోషిస్తోందని మంత్రి జవహర్ విమర్శించారు. సీఎంపై రోజా చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈడీ దర్యాప్తులో జగన్ సతీమణి భారతి పేరు ఉండటానికి, సీఎం చంద్రబాబుకు సంబంధం ఏంటో రోజానే చెప్పాలని డిమాండ్ చేశారు. రోజా నోటి దురుసుతో సంబంధంలేని వ్యాఖ్యలు చేసినందుకు సీఎంకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కుటుంబాన్ని బయటకు లాగింది, విజయమ్మను విశాఖలో పోటీ చేయించింది, షర్మిలతో ప్రచారం చేయించింది, భారతిని కంపెనీల్లోకి లాగింది జగన్ కాదా?...అని మంత్రి జవహర్ ప్రశ్నించారు.
జగన్...మతిలేని మాటలు
అనంతరం మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని ప్రజా ధనాన్ని లూటీ చేసి, ఇప్పుడు స్కూల్ ఎగ్గొట్టిన పిల్లాడిలా రోడ్ల వెంట తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు.రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షిస్తున్న తమను రైళ్లు తగలబెట్టించామంటూ ...జగన్ మతిలేని మాటలు మాట్లాడుతున్నారని మంత్రి ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా దక్కవన్నారు. అవినీతి డబ్బుతో పత్రిక, ఛానల్ పెట్టిన జగన్...ఎల్లో మీడియా అంటూ బురదజల్లుతున్నారని...ఎల్లో మీడియా అంటున్న జగన్కు వాటి పేర్లు చెప్పే దమ్ముకూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తుని రైలు దగ్ధం...జగన్ మనుషులు
తుని రైలు దగ్ధం కేసులో జగన్ మనుషులు ఉండటం వల్లే కేసులు ఎత్తేస్తామని వైసిపి అధినేత జగన్ చెబుతున్నాడని అంటూమంత్రి నారాయణ ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తుని రైలు దగ్థం కేసులు ఎత్తేస్తామని జగన్ చెబుతున్నాడని, అయినా అసలు ఆయన అధికారంలోకి వస్తే కదా కేసులు ఎత్తేయడానికి అని మంత్రి నారాయణ ఎద్దేవా చేశారు. దళితులు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని మంత్రి నారాయణ చెప్పారు.