ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి.. ఐటీ పంచనామా పత్రాలతో వైసీపీకి చెంపదెబ్బ: అచ్చెంనాయుడు
టీడీపీ చీఫ్, మాజీ సీఎం చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్పై ఐటీ దాడుల అంశాన్ని రాజకీయం చేయబోయి వైసీపీ బొక్కాబోర్లా పడిందని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెంనాయుడు అన్నారు. ఐటీ దాడులపై కేంద్రం ఆదివారం విడుదల చేసిన పంచనామా పత్రాల్లో అసలు నిజాలు బయటపడ్డాయని, దీంతో వైసీపీ నేతలు కిక్కురుమనడంలేదని విమర్శించారు.
పంచనామా రిపోర్టులో ఏముందంటే..
ఏపీకి చెందిన ఓ ప్రముఖవ్యక్తికి పీఎస్ గా పనిచేసిన వ్యక్తి దగ్గర్నుంచి అక్రమాస్తులకు సంబంధించి బలమైన ఆధారాలు లభ్యమయ్యాయని గతంలో ఐటీ శాఖ ప్రకటించడం, ఆ రూ.2వేల కోట్లు చంద్రబాబు మింగేసినవేనని వైసీపీ ప్రచారం చేయడం తెలిసిందే. అయితే ఆదివారం నాటి పంచనామా రిపోర్టులో.. పెండ్యాల శ్రీనివాస్ వద్ద రూ.2వేల కోట్ల అక్రమాస్తులు లభించాయనే అంశాన్ని ఐటీ శాఖ స్పష్టం చేయలేదు. మాజీ పీఏ ఇంట్లో జరిపిన సోదాల్లో రూ.2.63 లక్షల నగదు, 12 తులాల బంగారం మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మొత్తంగా రూ.2వేల కోట్ల అక్రమాలు జరిగినప్పటికీ, దానికి సంబంధించిన ఆధారాలు శ్రీనివాస్ ఇంట్లో లభించలేదని వెల్లడి కావడంతో టీడీపీ నేతలు వైసీపీపై రివర్స్ ఎటాక్ మొదలుపెట్టారు.
కుక్కల గోల..
ఐటీ సోదాలపై వైసీపీ నేతలు చేస్తోన్న అబద్ధపు ప్రచారాలు చూస్తుంటే ఉళ్లో పెళ్లికి కుక్కల హడావుడి సామెత గుర్తొస్తుందని, రూ.2వేల కోట్ల అవినీతి సొమ్ము దొరికిందని గగ్గోలు పెడతున్న వైసీపీకి ఇవాళ ఐటీ అధికారులు విడుదల చేసిన పంచనామా పత్రాలతో చెంపదెబ్బ తగిలినట్లయిందని అచ్చెన్నాయుడు అన్నారు.
మంత్రి బొత్సకు ఆయాసమే..
ఐటీ దాడుల విషయంలో అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని, ముఖ్యంగా మంత్రి బొత్స సత్యనారాయణ.. రూ.2వేల కోట్ల అబద్ధాన్ని ప్రచారం చేయడానికి చాలా కష్టపడ్డారని, ఆయన ఆవేశం చూసి మైకులకు కూడా పూనకం వచ్చాయని, చివరికి ఆయసమే తప్ప బొత్సకు ఏమీ మిగలలేదని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.