అభిమాని పిలిచినా: జగన్తో భేటీకి బాలయ్య డుమ్మా: పైకి చెబుతోందొకటి: విషయం వేరొకటి?
అమరావతి: తెలుగు చిత్ర పరిశ్రమను ఏలుతోన్న పెద్దల్లో విభేదాలు ఉన్నాయంటూ కొద్దిరోజులుగా మీడియాలో వస్తోన్న వార్తలు, కథనాలు, అనుమానాలను మరింత బలం కలిగించేలా.. తాజాగా సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఈ నెల 9వ తేదీన భేటీ కాబోయే టాలీవుడ్ టీమ్తో ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కలవట్లేదు. ఆయనను ఆహ్వానించినప్పటికీ.. తాను రాలేనని స్పష్టం చేశారని నిర్మాత సీ కల్యాణ్ చెబుతున్నారు.
సీబీఐ దూకుడు: ప్రైవేటు ఆసుపత్రికి డాక్టర్ సుధాకర్ షిఫ్ట్: వెంటే ఉన్న వంగలపూడి అనిత
ముఖ్యమంత్రితో భేటీ కాబోయే టీమ్కు మెగాస్టార్ లీడ్
వైఎస్ జగన్తో ఈ నెల 9వ తేదీన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో భేటీ కాబోతోంది టాలీవుడ్ టీమ్. ఈ మేరకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం అపాయింట్మెంట్ ఇచ్చింది. చిత్ర పరిశ్రమలో 24 క్రాఫ్ట్స్ను ప్రాతినిథ్యాన్ని వహించేలా ఒక్కో విభాగం నుంచి ప్రతినిధులను ఎంపిక చేశారు. ఈ టీమ్కు మెగాస్టార్ చిరంజీవి సారథ్యాన్ని వహించబోతున్నారు. ఇదివరకు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్తో భేటీ సమయంలోనూ చిత్ర పరిశ్రమ బృందాన్ని చిరంజీవే లీడ్ చేశారు.
షూటింగులకు అనుమతి ఇవ్వడం
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి లాక్డౌన్ కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో జనజీవనం సాధారణ పరిస్థితులకు చేరుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సడలింపులను కల్పించాయి. ఇందులో భాగంగా- జగన్ ప్రభుత్వం సినిమా షూటింగులకు కూడా అనుమతి ఇచ్చింది. కరోనా వైరస్ నిబంధనలకు అనుగుణంగా సినిమాలను సెట్స్పైకి తీసుకెళ్లడానికి ప్రభుత్వం వెసలుబాటును కల్పించింది. ఫలితంగా- త్వరలోనే షూటింగులు ఆరంభం కానున్నాయి.
కృతజ్ఙత తెలుపుకోవడానికి
షూటింగులకు అనుమతి ఇచ్చినందుకు కృతజ్ఙతలను తెలుపుకోవడానికి టాలీవుడ్ పెద్దలు వైఎస్ జగన్ను కలుసుకోబోతున్నారనేది ఫిల్మ్నగర్ టాక్. అంతర్గతంగా వేరే ప్రాధాన్యతలు ఉన్నాయని చెబుతున్నారు. చిత్ర పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరమూ నటులు, దర్శకులు, టెక్నీషియన్లు, నేపథ్య గాయకులు, సంగీత దర్శకులకు ఇచ్చే నంది అవార్డులను పునరుద్ధరించడం, ఎంటర్టైన్మెంట్ ట్యాక్సులు, స్టూడియోలను నిర్మించడానికి అవసరమైన భూములను కొనుగోలు చేయడంలో రాయితీలను కోరడం ఇవన్నీ ఎప్పుడూ ఉండేవే.
కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా..
సాధారణంగా- రాష్ట్రంలో ప్రభుత్వం మారిన ప్రతీసారి.. చిత్ర పరిశ్రమ పెద్దలు ఓ టీమ్గా ఏర్పడి కొత్త ముఖ్యమంత్రిని మర్యాదపూరకంగా కలుస్తుండటం ఆనవాయితీగా వస్తోంది. ఏపీ విషయంలో టాలీవుడ్ పెద్దలు ఈ ఆనవాయితీని కొనసాగించడానికి ఏడాది సమయం పట్టింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏడాది తరువాత ఆయనతో భేటీ కాబోతున్నారంటే అది ప్రాధాన్యత కలిగిన విషయమే. టాలీవుడ్కు చెందిన పెద్ద తలకాయలన్నీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటున్నాయనే అభిప్రాయాలు చాలాకాలం నుంచీ వినిపిస్తున్నాయి.
బాలకృష్ణ డుమ్మా కొట్టడానికి..
వైఎస్ జగన్తో భేటీకి బాలకృష్ణ డుమ్మా కొట్టడానికి అటు రాజకీయంగా, ఇటు సినీ పరిశ్రమ నుంచి కారణాలు లేకపోలేదు. రాజకీయంగా తీసుకుంటే.. బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. తన రాజకీయ ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలను కలుసుకోవడం బాలకృష్ణకు ఇష్టం లేకపోవచ్చు. సినీ పరిశ్రమ వైపు నుంచి చూసుకుంటే- మెగాస్టార్ చిరంజీవితో నెలకొన్న విభేదాలు. వైఎస్ జగన్ను కలుసుకోబోయే టీమ్ను మెగాస్టార్ లీడ్ చేయడం, ఆయన సారథ్యాన్ని వహించే టీమ్లో తాను సభ్యుడిగా ఉండటం బాలకృష్ణకు ఇష్టం లేదనే చెబుతున్నారు.
అటు చిరు.. ఇటు జగన్..
మొన్నటికి మొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలవడానికి తనకు ఆహ్వానం లేదని మండిపడ్డారు బాలకృష్ణ. అదే సమయంలో వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని కూడా విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయిదేళ్ల పాటు అధికారంలో ఉండబోదని జోస్యం చెప్పారు. ఈ పరిస్థితుల్లో అదే వైఎస్ జగన్ను తాను విభేదిస్తోన్న చిరంజీవితో కలిసి కలవడానికి బాలకృష్ణ నిరాకరించడంలో పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదనే వాదన కూడా వినిపిస్తోంది.
Recommended Video
కొసమెరుపేమిటంటే..
నిజానికి- వ్యక్తిగతంగా వైఎస్ జగన్కు నందమూరి బాలకృష్ణకు అభిమాని అనే పేరుంది. విద్యార్థిగా ఉన్న సమయంలో ఆయన బాలకృష్ణ సినిమాలను ఎగబడి చూసే వారని, ఓ సాధారణ ప్రేక్షకుడి తరహాలో ఎంజాయ్ చేసేవారని అంటుంటారు. ఓ దశలో కడప జిల్లా బాలకృష్ణ అభిమానుల సంఘానికి వైఎస్ జగన్ గౌరవ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారనే వార్తలు ఇదివరకే ఓ సారి సంచలనం రేపాయి. ఓరకంగా అభిమాని పిలిచినా బాలకృష్ణ తిరస్కరించినట్టేనని అంటున్నారు.