ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల జంప్: అమిత్ షాతో భేటీ: మరింత మందితో కలిసి..ఆ విధంగా..!
టీడీపీలో మరో కలకలం. నలుగురు రాజ్యసభ ఎంపీలను తమ పార్టీలోకి విలీనం చేసుకున్న బీజేపీ..ఇప్పుడు ఎమ్మెల్యే లను లక్ష్యంగా చేసుకుంది. ఇందులో భాగంగా.. ఒకే సారి ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు..ఒక అధికార ప్రతినిధి బీజేపీ నేతలతో టచ్లోకి వెళ్లగా ..వారికి కమలదళం నుండి స్పష్టమైన హామీ వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే మరి కొంత మంది ఎమ్మెల్యేలు వస్తారు ..వారు వచ్చిన సమయంలో కీలక నిర్ణయం తీసుకుందామంటూ ఈ ముగ్గురికి బీజేపీ నేతలు హామీ ఇచ్చినట్లు విశ్వస నీయ సమాచారం. దీంతో..ఇప్పుడు ఆ ముగ్గురినీ వారించేందుకు టీడీపీ అధినాయకత్వం రంగంలోకి దిగింది.
Recommended Video
ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల జంప్..
టీడీపీని లక్ష్యంగా చేసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా..ఇప్పటికే నలుగురు టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులను విలీనం ద్వారా తమ పార్టీలో కలిపేసుకున్న బీజేపీ..ఇప్పుడు ఎమ్మెల్యేల పైన దృష్టి పెట్టింది. లోక్సభలో పూర్తి స్థాయి మెజార్టీ ఉండంతో పాటుగా అదనంగా బలం ఉండంతో..ఎంపీల గురించి ఆలోచన చేయటం లేదు. ఏపీలో ప్రధానిని వ్యక్తిగతంగా..బీజేపీ పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించిన టీడీపీని ఎలాగైనా కోలుకోలేని దెబ్బ తీయాలని బీజేపీ డిసైడ్ అయింది. అందులో భాగంగా.. ఇప్పుడు టీడీపీ నుండి ఏపీ శాసన సభలో ఉన్న 23 మంది ఎమ్మెల్యేల పైన ఫోకస్ చేస్తోంది. అందులో చంద్రబాబు..బాలకృష్ణను మినహాయిస్తే మిగిలిన 21 మంది ఎమ్మెల్యేల్లో ఎంత మంది టీడీపీలో ఉంటారో..ఎంత మంది పార్టీ వీడుతారో అనే ఉత్కంఠ పార్టీలో కొద్ది రోజులుగా కనిపిస్తోంది. దీనికి తగినట్లుగానే ఇప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేలు..పార్టీ వాయిస్ బలంగా వినిపించే ఒక నేత బీజేపీ నేతలతో మంతనాలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
రేపల్లె ఎమ్మెల్యే..లంకా దినకర్ సైతం..
కొద్ది రోజుల క్రితం టీడీపీ నుండి బీజేపీలో చేరిన గరికపాటి మోహనరావు ఆధ్వర్యంలో ఢిల్లీలోని బీజేపీ నేతలతో గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో సమావేశం అయ్యారు .టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ సైతం వారితో ఉన్నారు. తాము టీడీపీ వీడి బీజేపీలోకి రావటానికి సిద్దంగా ఉన్నామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. వీరు బీజేపీ నేతలతో సమావేశమైన సమయంలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలతో ఫోన్ ద్వారా మాట్లాడిచినట్లుగా విశ్వసనీయ సమాచారం. గుంటూరు జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే అదే విధంగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే బీజేపీలో చేరేందుకు సంసిద్దత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే, బీజేపీ నేతల సూచనల మేరకు వారు మరి కొద్ది రోజులు వేచి చూసే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సైతం పార్టీ మాజీ నేత సుజనా చౌదరితో టచ్లో ఉన్నారని..ఆయన బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం సాగుతోంది. అయితే వంశీ మాత్రం తాను సుజనా చౌదరితో మాట్లాడలేదని..పార్టీ మారే ప్రయత్నం చేయలేదని చెబుతున్నారు.
మరి కొంత మందితో సంప్రదింపులు..
టీడీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటుగా మరి కొందరు నేతలు వివిధ మార్గాల్లో బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నా..ఆ పార్టీలోకి వెళ్లలేని టీడీపీ నేతలు ఇప్పుడు బీజేపీ బాట పడుతున్నారు. టీడీపీ వాయిస్ బలంగా వినిపించే ఓ మహిళా నేత సైతం బీజేపీలోకి వెళ్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ మహిళా నేత బీజేపీ నేతలతో సంప్రదింపులు పూర్తి చేసినట్లుగా చెబుతున్నారు. ఇక, విశాఖ నగరంలోని ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారటానికి సిద్దంగా ఉన్నా..సమయం వచ్చినప్పుడు వారి వివరాలు చెబుతామని బీజేపీ నేతలు గోప్యత పాటిస్తున్నారు. ఇది ఇలా ఉంటే..ఇంత మంది నేతలు అటు ఎంపీలు..ఇటు ఎమ్మెల్యేలు సైతం టీడీపీని వీడే ప్రయత్నాలు జరుగుతుంటే వారితో ఫోన్ సంప్రదింపులు మినహా..గట్టిగా టీడీపీ అధినాయకత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపించటం లేదు. పార్లమెంట్ సమావేశాలు ముగిసే లోగానే ఆపరేషన్ ఏపి దాదాపు కొలిక్కి వస్తుందని బీజేపీ నేతలు ధీమాగా చెబుతున్నారు.