బీజేపీ దూతగా గంటా శ్రీనివాస్? కమలం చక్రం తిప్పుతోందా?: మెగాస్టార్ తో భేటీ వెనుక ఆంతర్యం?
విశాఖపట్నం: టాలీవుడ్ మెగాస్టార్, కేంద్ర మాజీమంత్రి చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారా? భారతీయ జనతాపార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయా? ఈ ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ఆయనను కలిశారా? ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల్లో చోటు చేసుకుంటున్న చర్చలివి. రాజకీయాల్లోకి పున: ప్రవేశించాలని, తమ పార్టీలో చేరాలని కోరుతూ ఓ జాతీయ పార్టీ తనపైనా ఒత్తిడి తెస్తోందని అంటూ చిరంజీవి ఇటీవలే వెల్లడించిన విషయం తెలిసిందే. తన తాజా చిత్రం సైరా ప్రమోషన్ లో భాగంగా.. ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాజకీయాలపై తాను దృష్టి పెట్టట్లేదని, సినిమాలపైనే ఫోకస్ చేశానని ఆయన అదే ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అక్కడితో ఈ ఊహాగానాలకు తెరపడి పోయిందని అనుకున్నారంతా. అదే సమయంలో- గంటా శ్రీనివాస్ మెగాస్టార్ తో సమావేశం కావడంతో మరోసారి చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ అంశం చర్చల్లోకి వచ్చింది.
ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా.. కిరణ్ మంత్రివర్గంలో మంత్రిగా..
చిరంజీవితో గంటా శ్రీనివాస్ కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. వారిద్దరి మధ్య రాజకీయాలకు అతీతమైన అనుబంధం ఉంది. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు. ప్రజారాజ్యం పార్టీ తరఫున గంటా శ్రీనివాస్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తరువాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేసిన అనంతరం..ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ బెర్త్ ను సంపాదించారు. 2014లో రాష్ట్ర విభజన చోటు చేసుకున్న తరువాత గంటా శ్రీనివాస్ తన సొంత గూడు తెలుగుదేశంలో చేరారు. మంత్రిగా కొనసాగారు కూడా. మొన్నటి లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా పరాజయం పాలైన అనంతరం- గంటా శ్రీనివాస్ టీడీపీలో పెద్దగా క్రియాశీలకంగా లేరనే వార్తలు వస్తున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ విషయం స్పష్టమైందని అంటున్నారు.
బీజేపీతో టచ్ లో గంటా..
ఈ నేపథ్యంలో- గంటా పార్టీ ఫిరాయిస్తారని, భారతీయ జనతాపార్టీ రాష్ట్ర నాయకులతో ఎప్పటికప్పుడు ఆయన టచ్ లో ఉన్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పార్టీ ఫిరాయిస్తారంటూ వచ్చిన వార్తలను ఆయన ఖండించిన సందర్భాలు కూడా దాదాపుగా లేవు. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీ మారడం ఖాయమేనని, ముహూర్తం కోసం వేచి చూస్తున్నారని అంటున్నారు. ఇదే సందర్భంలో- రాజకీయాల్లో రీ ఎంట్రీపై ఓ జాతీయ పార్టీ ఒత్తిడి తెస్తోందని చిరంజీవి పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి పేర్కొనడం, అదే క్రమంలో- గంటా శ్రీనివాస్ చిరంజీవితో భేటీ కావడం చర్చనీయాంశమైంది.. ప్రత్యేకించి ఉత్తరాంధ్ర రాజకీయాల్లో. ఓ మంచి ముహూర్తం చూసుకుని- ఒకేసారి ఇద్దరూ కాషాయ కండువాను కప్పుకోవడమా? లేక చిరంజీవిని బీజేపీలోకి చేరేలా వ్యక్తిగతంగా ఆయన సన్నిహితులతో ఒత్తిడి తీసుకుని రావడమా? అనేది తేలాల్సి ఉంది.
చిరంజీవిని కలుపుకెళ్లే ప్రయత్నమా?
మొత్తానికి- బీజేపీ దూతగా గంటా శ్రీనివాస్ మెగాస్టార్ ను కలిశారని అంటున్న వారి సంఖ్య కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. మొన్నటి ఎన్నికల అనంతరం బలమైన పార్టీగా ఆవిర్భవించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఎదుర్కొనడానికి తెలుగుదేశం పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. చంద్రబాబు పరిపాలనలో చోటు చేసుకున్న తప్పులు గానీ పొరపాట్లు గానీ.. ఆ పార్టీ ముందరి కాళ్లకు బంధం వేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా బీజేపీని బలోపేతం చేయడానికి టీడీపీ నాయకులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. ఈ కారణంతోనే- టీడీపీకి చెందిన సీఎం రమేష్, సుజనా చౌదరిలతో పాటు పలువురు ఛోటా, మోటా నాయకులు బీజేపీలో చేరుతున్నారనే అభిప్రాయాలు ఇదివరకే వ్యక్తమయ్యాయి. చిరంజీవితో గంటా భేటీకి పెద్దగా రాజకీయ కారణాలేమీ లేవని అంటున్నప్పటికీ.. నిప్పు లేనిదే పొగరాదని అంటున్నారు విమర్శకులు.