జగన్ వల్లే రవికిరణ్ బలి, తప్పేంటో పోలీసులే తేలుస్తారు!: ఎమ్మెల్యే అనిత
రవికిరణ్ చేసిన తప్పేంటో పోలీసులే తేలుస్తారని స్పష్టం చేశారు. వైసీపీ అధినేత జగన్ పన్నుతున్న కుట్రలకు రవికిరణ్ లాంటి వ్యక్తులు బలవుతున్నారని ఆరోపించారు.
విజయవాడ: పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్ను టీడీపీ ప్రభుత్వం విడిచిపెట్టేలా లేదు. విచారణ పేరుతో ఇప్పటికే ఓసారి రవికిరణ్ ను అదుపులోకి తీసుకుని వదిలేసిన ఏపీ పోలీసులు.. మరోసారి ఆయన్ను అరెస్టు చేశారు. ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు మేరకు ఈసారి ఏకంగా ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయడం గమనార్హం.
అయితే రవికిరణ్ మాత్రం తన చర్యలను సమర్థించుకుంటుండగా.. అటు టీడీపీ మాత్రం రవికిరణ్ తీరును ఎండగడుతోంది. ముఖ్యంగా రవికిరణ్ ను వెనుక ఉండి నడిపిస్తోంది జగనే అనేది వారి ప్రధాన ఆరోపణ. తాజాగా ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు మెప్పు కోసం కేసులు పెట్టాల్సిన అవసరం తమకు లేదని అన్నారు.
ఇమేజ్ను కాపాడుకోవడానికి కేసులు పెట్టాల్సిన అవసరం తమకు లేదని, టీడీపీలో కార్యకర్త స్థాయి నుంచి ప్రతీ ఒక్కరికి గుర్తింపు ఉంటుందని చెప్పుకొచ్చారు. రవికిరణ్ చేసిన తప్పేంటో పోలీసులే తేలుస్తారని స్పష్టం చేశారు. వైసీపీ అధినేత జగన్ పన్నుతున్న కుట్రలకు రవికిరణ్ లాంటి వ్యక్తులు బలవుతున్నారని ఆరోపించారు.
కేవలం జగన్ వల్లే ఈరోజు రవికిరణ్ అరెస్టు అయ్యాడని, దొంగలను నమ్ముకుంటే ఇలాంటి పరిస్థితే తలెత్తుతుందని అనిత ఎద్దేవా చేశారు.