రాస్కెల్స్..! మీకు ప్రొటోకాల్ తెలుసా?...అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని చిందులు
చిత్తూరు:ప్రజాప్రతినిథులుగా గెలవగానే తాము చట్టానికి అతీతులమని భావిస్తారో ఏమో కాని...విచక్షణ మరిచి కొందరు చట్టసభల సభ్యులు మాట్లాడే మాటలు... ప్రవర్తించే తీరు ప్రజాస్వామ్య తీరుతెన్నులనే అపహాస్యం పాలుచేస్తోంది.
తాజాగా నెల్లూరు జిల్లా ఉదయగిరి టిడిపి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు అధికారులను దూషించిన విధానం, వ్యవహరించిన తీరు ప్రభుత్వ ఉద్యోగుల ఆగ్రహానికి జనాల విమర్శలకు కారణమైంది. తిరుపతి విమానాశ్రయానికి గురువారం కర్ణాటక సీఎం కుమారస్వామి రాక సందర్భంగా తనకు సంబంధించి చిత్తూరు జిల్లా అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని ఆయన మండిపడ్డ సందర్భంలో ఆయన ప్రవర్తన చర్చనీయాంశంగా మారింది.
"రాస్కెల్స్..! మీకు అసలు ప్రొటోకాల్ గురించి తెలుసా?...మీ అంతు చూస్తా...! మీపై సీఎంకు ఫిర్యాదు చేస్తా..!"నంటూ ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు చిత్తూరు జిల్లా అధికారులపై చిందులు తొక్కారు. తిరుపతి విమానాశ్రయానికి గురువారం కర్ణాటక సీఎం కుమారస్వామి విచ్చేశారు. ఆ సందర్భంలో విమానాశ్రయంలో చిత్తూరు జిల్లా అధికారులు తనను పట్టించుకోలేదని...ప్రొటోకాల్ పాటించలేదని ఆయన అధికారులపై మండిపడ్డారు.
అక్కడే ఉన్న జేసీ గిరీష, రేణిగుంట తహసీల్దార్ నరసింహులు నాయుడిపై ఒంటికాలిపై లేస్తూ వార్నింగ్లు మీద వార్నింగ్ లు ఇచ్చారు. ఎమ్మెల్యే దూషణలతో దిగ్భ్రాంతి చెందిన అధికారులు మిగిలిన అధికారులతో ఈ విషయాన్ని పంచుకోగా అనంతరం అధికార యంత్రాంగం ఎమ్మెల్యే తీరును తీవ్రంగా ఖండించింది. ఎమ్మెల్యే తన దూషణల పర్వానికి సంబంధించి శుక్రవారం కల్లా బేషరతుగా క్షమాపణ చెప్పకుంటే నిరసన తెలుపుతామని ప్రభుత్వ ఉద్యోగులు ప్రకటించారు.
రెవెన్యూ శాఖ సిబ్బందితో పాటు అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తారని జిల్లా రెవెన్యూ అసోసియేషన్, ఏపీజేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ విజయసింహారెడ్డి, కార్యదర్శి అమర్నాథ్ హెచ్చరించారు.