టిడిపిలో 'మగాళ్ల' గురించి రోజాకు తెలుసు: ఉమ, నారాయణ ర్యాంక్పై పత్తిపాటి షాక్
విజయవాడ: తెలుగుదేశం పార్టీలో మగాళ్లు ఉన్నారో లేదో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాకు తెలుసునని టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమ మంగళవారం నాడు కౌంటర్ ఇచ్చారు. టిడిపిలో మగాళ్లు లేరా, అందుకే వైసిపి నుంచి చేర్చుకుంటున్నారా అని రోజా రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించారు.
దానికి బోండా ఉమ మంగళవారం నాడు కౌంటర్ ఇచ్చారు. గతంలో టిడిపిలో ఉన్న రోజాకు తమ పార్టీలో మగాళ్లు ఉన్నారో లేరో బాగా తెలుసునని చెప్పారు. రోజా వేధింపులను తాళలేకపోతున్నామని వైసిపి ఎమ్మెల్యేలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
విశాఖ రైల్వే జోన్ కోసం జగన్ ఇక్కడ మాట్లాడటం విడ్డూరమన్నారు. గతంలో చంద్రబాబు విభజన హామీల కోసం ఢిల్లీలో పోరు చేశారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీలు అమలు చేయాలని తాము కేంద్రాన్ని ఎప్పటికప్పుడు కోరుతున్నామని చెప్పారు.
కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని బోండా ఉమ ధ్వజమెత్తారు. జగన్ నిరంకుశ వైఖరి వల్లనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు టిడిపి వైపు వస్తున్నారని చెప్పారు. జగన్కు ఎమ్మెల్యేలు అంటే ఏమాత్రం గౌరవం లేదని చెప్పారు.
గతంలో బోగాపురం విమానాశ్రయాన్ని అడ్డుకున్నది జగనేనని మండిపడ్డారు. ఇప్పుడు బందరు పోర్టును అడ్డుకునేందుకు రైతులను ఉద్దేశ్యపూర్వకంగా రెచ్చగొడుతున్నారన్నారు. జగన్కు చంద్రబాబు గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.
నారాయణకు 18వ ర్యాంకా, ఆశ్చర్యం: పత్తిపాటి
మంత్రి నారాయణకు 18వ ర్యాంక్ రావడంపై మరో మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ర్యాంకుల పైన మీడియాలో వచ్చిన సమాచారమే తనకు తెలుసునని చెప్పారు.
నారాయణ రేయింబవళ్లు కష్టపడుతున్నారని, ఆయనకు 18వ ర్యాంకు రావడం ఆశ్చర్యమని, అది తనకు మీడియా ద్వారానే తెలుసునని వ్యాఖ్యానించారు. చంద్రబాబు 65 ఏళ్ల వయస్సులో బాగా కష్టపడుతున్నారన్నారు. తమ పార్టీ ముఖ్యమంత్రి కుర్చీ కోసం పాకులాడే పార్టీ కాదని జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గత అనుభవాల దృష్ట్యా కృష్ణా పుష్కరాలకు మరింత కట్టుదిట్టమైన భద్రత ఉంటుందన్నారు.