మరో వివాదంలో ఎమ్మెల్యే చింతమనేని: తమపై దౌర్జన్యం చేశారని పోలీసులకు విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు
పశ్చిమ గోదావరి:దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అక్రమ మైనింగ్ కార్యకలాపాలను అడ్డుకున్న తమపై చింతమనేని దౌర్జన్యం చేశారంటూ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది.
చింతమనేని ప్రభాకర్ తమపై దౌర్జన్యానికి పాల్పడటంతో పాటు అనుచరులను దాడికి ప్రోత్సహించినట్లు వారు చెబుతున్నారు. ఈ దృశ్యాలను చిత్రీకరించేందుకు ప్రయత్నించిన విలేకరులపైనా ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు. వివరాల్లోకి వెళితే...
సోమవారం రాత్రి పెదవేగి మండలం కొప్పాక వద్ద అక్రమ మైనింగ్పై సమాచారం అందడంతో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో నాలుగు టిప్పర్లు, ప్రొక్లైనర్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ సీఐ నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని బృందం ఈ దాడులు నిర్వహించినట్లు తెలిసింది. అయితే విజిలెన్స్ సిబ్బంది దాడుల గురించి తెలిసిన వెంటనే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ఘటనాస్థలానికి చేరుకున్నారట.
ఆ క్రమంలో మా టిప్పర్లనే సీజ్ చేస్తారా? మా వాళ్లపైనే కేసులా?...అంటూ ఆయన విజిలెన్స్ అధికారులపై దౌర్జన్యానికి దిగారని తెలుస్తోంది. సీజ్ చేసిన వాహనాలు వదలి వేయాలని అధికారులను బెదిరించారని..అయినా వారు ఆ వాహనాలను వదలకపోవడంతో ఎమ్మెల్యే చింతమనేని అక్కడ నుంచి వెనుదిరగి వెళ్లిపోయారని సమాచారం.
అయితే కొద్దిసేపటికే ఘటనా స్థలానికి చింతమనేని సోదరుడు, దుగ్గిరాల మాజీ సర్పంచ్ చింతమనేని సతీష్, అతడితో పాటు వందమంది వ్యక్తులు విజిలెన్స్ అధికారులను చుట్టుముట్టారని అంటున్నారు. వచ్చిన వాళ్లు విజిలెన్స్ బృందాన్ని భయభ్రాంతులకు గురిచేసి అధికారులు సీజ్ చేసిన నాలుగు వాహనాలను వెనక్కి తీసుకెళ్లిపోయారట.
వచ్చిన వారు ఎమ్మెల్యే చింతమనేని ప్రోద్భలంతోనే తమపై దౌర్జన్యం చేశారని, అలాగే సీజ్ చేసిన వాహనాలు తీసుకెళ్లి పోయారని విజిలెన్స్ అధికారులు వాపోయారట.అయితే జరిగిన ఘటనపై విజిలెన్స్ అధికారులు పెదవేగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు విజిలెన్స్ డీజీ దృష్టికి తీసుకెళ్లారు.