అటు బస్సు యాత్ర: ఇటు కారెక్కిన టిడిపి ఎమ్మెల్యే
వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆకర్ష్ మంత్రాన్ని తిప్పికొట్టేందుకు తెలుగుదేశం పార్టీ చేపట్టిన బస్సు యాత్ర ఓ వైపు కొనసాగుతుండగానే మరోవైపు ఆ పార్టీ శాసనసభ్యుడు తెరాసలోకి జంప్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డిల తోవలోనే పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శుక్రవారం తెలుగుదేశం పార్టీని వీడారు.
తాను తెరాస పార్టీలో చేరుతున్నట్టు వరంగల్ జిల్లా పరకాల శాసనసభ్యుడు ధర్మా రెడ్డి ప్రకటించారు. ఆ వెంటనే తెరాస నేతలు ఆయనను పుష్పగుచ్ఛాలతో ముంచెత్తారు. నిజానికి, ధర్మారెడ్డి పార్టీ మారుతున్నట్టు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హన్మకొండలోని తన నివాసంలో నియోజకవర్గ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో చర్చలు జరిపారు. అనంతరం తన నిర్ణయాన్ని మీడియాకు వెల్లడించారు.
తాను టిడిపిలో ఉన్నప్పటికీ కెసిఆర్ ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికి తాను సమర్పించిన ప్రతిపాదనలను పూర్తిగా ఆమోదించిందని, ఈ పరిస్థితుల్లో అధికార పార్టీలోకి వెళితే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చునని అనిపించిందని ఆయన అన్నారు. కార్యకర్తల మనోభావమూ అదేనని, గత 20 ఏళ్లుగా అనేక కారణాలుగా పరకాల వెనకబడిందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికార పార్టీకి మద్దతు ఇవ్వాలనుకున్నానని ఆయన చెప్పారు.
అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు తనను ఎంతో ఆదరించారని, పార్టీ టికెట్ ఇచ్చి ప్రోత్సహించారని, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్నట్టుగానే పరకాలను తాను ప్రగతిపథంలో నిలపాలనుకుంటున్నానని, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామిని కావాలనుకుంటున్నానని ఆయన చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తెలుగుదేశం పార్టీ శానససభ్యులను తన పార్టీలోకి తీసుకోవడానికి ప్రత్యేక వ్యూహం రచించి అమలు చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో తుడిచిపెట్టాలనే ఆలోచనతో ఆయన ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే తలసాని శ్రీనివాస యాదవ్, తీగల కృష్ణా రెడ్డిలను ఇది వరకే పార్టీలో చేర్చుకోగా, ఇప్పుడు ధర్మారెడ్డిని చేర్చుకుంటున్నట్లు చెబుతున్నారు.