కుమిలిపోతున్న ధూళిపాళ్ల!: కనీసం ఫోన్ కూడా చేయని చంద్రబాబు..
ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడ్డా.. దానికి గుర్తింపు లేకపోలేగా, కనీసం ఫోన్ ద్వారానైనా తనతో మాట్లాడకపోవడం పట్ల ధూళిపాళ్ల అసంతృప్తితో ఉన్నారు.
విజయవాడ: టీడీపీలో అసంతృప్తుల పర్వం కొనసాగుతోంది. మంత్రి పదవులు దక్కని కొందరు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తికి లోనవ్వడంతో సీఎం చంద్రబాబు వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగోలా నచ్చజెప్పి పార్టీలో అసంతృప్తులకు తావు లేకుండా చేయాలని యోచిస్తున్నారు.
మంత్రిపదవి దక్కలేదన్న నైరాశ్యంలో ఉన్న ఎమ్మెల్యేలను బుజ్జగిస్తున్న చంద్రబాబు.. ఒక్క ధూళిపాళ్లను మాత్రం విస్మరించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మిగతా నేతలను ఫోన్ల ద్వారానో, లేక ఇంటికి పిలిపించుకునో సర్థిచెబుతున్న ఆయన ధూళిపాళ్ల గురించి అసలేమాత్రం పట్టించుకోవడం లేదని చెబుతున్నారు.
ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడ్డా.. దానికి గుర్తింపు లేకపోలేగా, కనీసం ఫోన్ ద్వారానైనా తనతో మాట్లాడకపోవడం పట్ల ధూళిపాళ్ల అసంతృప్తితో ఉన్నారు. మంత్రి వర్గ విస్తరణ ముందు కూడా ధూళిపాళ్ల సీఎంతో భేటీ అయి మరీ తన కోరిక వెలిబుచ్చారు. అయితే సీఎం నుంచి ఎలాంటి హామి లభించకపోవడంతో తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్నవారిని కాదని, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు ఇవ్వడం పట్ల ఆయన లోలోపల బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
అసంతృప్తిలో చాంద్ భాషా:
మైనార్టీ కోటాలో మంత్రిపదవి దక్కుతుందని ఎమ్మెల్యే చాంద్ భాషా చాలానే ఆశలు పెట్టుకున్నారు. కానీ ముస్లిం ఎమ్మెల్యేలను సీఎం పక్కనబెట్టేయడంతో చాంద్ భాషాకు నిరాశ తప్పలేదు. సోమవారం నాడు సీఎంను కలిసేందుకు ప్రయత్నించినా.. అపాయింట్ మెంట్ మాత్రం లభించలేదు.
కాగా, తొలుత మైనార్టీ కోటాలో జలీల్ ఖాన్ కు మంత్రిపదవి లభించే అవకాశాలు కనిపించాయి. కానీ బీకామ్ లో ఫిజిక్స్ వంటి వ్యాఖ్యలతో జనంలో ఆయన చులకనైపోయారు. దీంతో చాంద్ భాషాకు మైనార్టీ కోటాలో మంత్రిపదవి దక్కుతుందని చాలామంది భావించారు. కానీ సీఎం మాత్రం మైనార్టీ ఎమ్మెల్యేలకు హ్యాండ్ ఇవ్వడంతో పరాభవం తప్పలేదు.