‘టీడీపీలో సంక్షోభం’ కారెం శివాజీ వ్యాఖ్యలపై డోలా బాల గుస్సా, రాజకీయ భిక్ష పెట్టినవారిపై విమర్శలా..?
తెలుగుదేశం పార్టీ తమదేనని 17 మంది సభ్యులు స్పీకర్కు లేఖ రాస్తారని వైసీపీ నేత కారెం శివాజీ చేసిన కామెంట్లపై టీడీపీ ధీటుగానే స్పందించింది. రాజకీయ భిక్ష పెట్టిన వారిని విమర్శించడం సరికాదని కొండాపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శించారు. టీడీపీలో తగిన ప్రాధాన్యం ఇచ్చి.. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ చేసినా.. మీ బుద్ధి చూపించుకున్నారని ఫైరయ్యారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకొన్న తర్వాత కారెం శివాజీ మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే. దీనిపై వీరాంజనేయ స్వామి స్పందించారు.
తిన్నింటి వాసాలు లెక్కించే..
కారెం శివాజీ తిన్నింటి వాసాలు లెక్కపెట్టే రకం అని వీరాంజనేయ స్వామి మండిపడ్డారు. కారెం శివాజీ రాజకీయం, విలువల గురించి మాట్లాడటం ఎబ్బెట్టుగా ఉందన్నారు. పాముకు పాలుపోసి పెంచినా.. కాటు వేయాలనే ఆలోచనతోనే ఉంటుందే తప్ప.. జాలి చూపదని గుర్తుచేశారు. కారెం శివాజీ కూడా అలాంటి వారేనని.. రాజకీయంగా భిక్ష పెట్టిన టీడీపీపైనే విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ను చేసి అందలం ఎక్కించిన వైనాన్ని మరచిపోయారని విమర్శించారు.
నీచ రాజకీయాలా..?
బలహీనవర్గాల వారికి మేలు చేయాలని టీడీపీ భావిస్తోంది. అధినేత చంద్రబాబు నాయుడు కూడా వారి సంక్షేమం కోసమే పనిచేస్తారని పేర్కొన్నారు. అదుకోసమే ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవీని కారెం శివాజీకి అప్పగించారని తెలిపారు. క్యాబినెట్ హోదా కల్పించిన చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఊసరవెల్లి రంగులు మార్చినట్టు కారెం శివాజీ వైసీపీలో చేరాడని గుర్తుచేశారు. చంద్రబాబు పదవీ ఇస్తే, పదవీ నుంచి దించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించారని తెలిపారు. అయినా వైసీపీలో చేరి.. ఆ పార్టీ నేతల మాదిరిగా నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రజలు నవ్వుతున్నారు..?
అధికారంలో ఎవరూ ఉంటే వారి పంచన చేరడం కారెం శివాజీకి అలావాటు అని వీరాంజనేయస్వామి విమర్శించారు. పార్టీలు మారుతూ నీతులు వల్లిస్తుంటే ప్రజలు చూసి నవ్వుతున్నారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ చైర్మన్గా ఉన్న సమయంలో కూడా ఎస్సీల కోసం పనిచేయలేదని చెప్పారు. అధికార పార్టీ మెప్పు పొందేందుకు టీడీపీపై విమర్శలు చేయడం సరికాదన్నారు. దళితుల అభివృద్ధిని కోరుకుంటే వారి కోసం పనిచేసిన టీడీపీని విడిచివెళ్లేవారు కాదన్నారు. మరో పార్టీలో చేరడంతో ఏం జరిగిందో అర్థం చేసుకోవాలన్నారు.
బుద్ధిచెబుతారు..
సీఎం జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందేందుకే కారెం శివాజీ టీడీపీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. కారెం శివాజీ మాటలను ప్రజలు కూడా గమనిస్తున్నారని చెప్పారు. రాజకీయ భిక్ష పెట్టిన వారిని విమర్శించడం సరికాదని హితవు పలికారు. కారెం శివాజీని దళిత సమాజం గమనిస్తోందని, ఆయనకు వారే బుద్దిచెబుతారని తెలిపారు.