టీటీడీ బోర్డు నుంచి సండ్ర వెంకట వీరయ్య ఉద్వాసన
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నుంచి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఉద్వాసనకు గురయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయనను పాలకమండలి సభ్యత్వం నుంచి తొలగించింది. ఈ మేరకు రెవెన్యూ (దేవాదాయం) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాలకమండలి సభ్యునిగా పునర్నియామకం చేస్తూ ఆదేశాలు వెలువడిన 30 రోజుల తరువాత కూడా సండ్ర వెంకట వీరయ్య ప్రమాణ స్వీకారం చేయలేదనే కారణంతో ఉద్వాసన పలికినట్లు జీవోలో పేర్కొన్నారు.
ప్రతిష్ఠాత్మక టీటీడీ బోర్డు నుంచి ఒక సభ్యుడిని ఉద్వాసన పలకడం.. ఈ అయిదేళ్ల కాలంలో ఇది రెండోసారి. గతంలో టీడీపీకే చెందిన శేఖర్ రెడ్డిని బోర్డు నుంచి ఉద్వాసన పలికారు. వేల కోట్ల రూపాయలు ఆయన నివాసంలో వెలుగులోకి రావడంతో ఆయనను తొలగించారు.
ఓటుకు నోటు ఆరోపణలు ఉన్నప్పటికీ సభ్యత్వం..
తెలంగాణకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే వెంకట వీరయ్యపై నోటుకు ఓటు ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టీడీపీ తరఫున ఖమ్మంజిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉన్నందున.. ఆయన తన టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత సండ్రను మళ్లీ టీటీడీ బోర్డు సభ్యునిగా పునర్నియమించారు. ఈ మేరకు రెవెన్యూ (దేవాదాయం) శాఖ గత ఏడాది డిసెంబర్ 17వ తేదీన జీవో జారీ చేసింది. బోర్డు సభ్యునిగా పునర్నియమితులైనప్పటికీ.. సండ్ర ప్రమాణ స్వీకారం చేయలేదు. దీనితో ఆయనను తొలగిస్తూ తాజాగా ఉత్తర్వులు వెలవడ్డాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో సండ్ర వెంకట వీరయ్య ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు 50 లక్షల రూపాయలను ఇస్తూ ఆ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అధికారుల చేతికి చిక్కిన రేవంత్ రెడ్డిని విచారించిన సందర్భంలో మొదటిసారిగా సండ్ర పేరు వినిపించింది. అప్పుడు కూడా ఆయన ఉద్వాసనను ఎదుర్కొన్నారు. న్యాయస్థానం విచారణ అనంతరం, స్టే తెచ్చుకున్న ఆయన మళ్లీ బోర్డులో చోటు దక్కించుకున్నారు.
టీడీపీకి దూరంగా ఉండటం వల్లేనా?
ఓటుకు నోటు కేసులో పేరు వినిపించిన తరువాత కూడా సండ్రకు టీటీడీ బోర్డులో చోటు కల్పించిన ఏపీ ప్రభుత్వం.. ఉన్నపళంగా ఆయనను తొలగించడం వెనుక పెద్ద కథే ఉన్నట్లు తెలుస్తోంది. 30 రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయకపోవడం అనేది ఓ చిన్న కారణమే. వాస్తవ పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి. గత ఏడాది నవంబర్ లో తెలంగాణ ఎన్నికలు ముగిసినప్పటి నుంచీ సండ్ర.. తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఓ దశలో అధికార టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది. అలాగని, ఆయన టీఆర్ఎస్ లో చేరలేదు. దీనికి సంబంధించిన వార్తలనూ ఖండించనూ లేదు. పార్టీ కార్యకలాపాలకు మాత్రం దూరంగా ఉన్నారు. టీడీపీకి రాజీనామా చేయాల్సి వస్తే, ఆ పార్టీ కల్పించిన టీటీడీ సభ్యత్వం అడ్డుంగా ఉంటుందనే ఉద్దేశంతోనే సండ్ర ప్రమాణ స్వీకారం చేయలేదని సమాచారం. ఆయన వైఖరిని పసిగట్టిన ఏపీ ప్రభుత్వం.. దీన్ని దృష్టిలో ఉంచుకుని, రాజకీయ కారణాలతోనే సండ్రను బోర్డు సభ్యత్వం నుంచి తప్పించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
సండ్ర స్థానంలో ఇనుగాల లేదా తూళ్ల వీరేంద్ర గౌడ్
తెలంగాణ నుంచి ఒకర్ని ఉద్వాసన పలికిన కారణంగా.. ఆ స్థానాన్ని అదే రాష్ట్రానికి చెందిన వ్యక్తితో భర్తీ చేయాల్సి ఉంటుంది. దీనితో సండ్ర స్థానంలో ఎవరికి టీటీడీ బోర్డు సభ్యత్వాన్ని కల్పిస్తారనేది తాజాగా చర్చనీయాంశమైంది. సండ్ర ఉద్వాసన తెలిసిన వెంటనే టీడీపీకి చెందిన కీలక నాయకులు తమవైపు నుంచి ప్రయత్నాలను మొదలు పెట్టారు. ఈ జాబితాలో ఇనుగాల పెద్దిరెడ్డి, టీడీపీ రాజ్యసభ సభ్యుడు తూళ్ల దేవేందర్ గౌడ కుమారుడు వీరేంద్ర గౌడ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరేంద్ర గౌడ్.. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసి, ఓడిపోయారు. ఈ ఇద్దరితో పాటు మరికొందరు తమవంతు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.