లిక్కర్ బ్రాండ్స్ వ్యాఖ్యలపై టీడీపీ మహిళా ఎమ్మెల్యేకి ట్రోల్స్: అసెంబ్లీలో ఆదిరెడ్డి భవానీ ఉద్వేగం
ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.అసెంబ్లీలో టీడీపీ మహిళా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భావోద్వేగానికి లోనయ్యారు. నిన్న మద్యం పాలసీపై జరిగిన చర్చలో మాట్లాడిన భవానీ రాష్ట్రంలో లిక్కర్ బ్రాండ్లు బాగా తగ్గిపోయాయని, ప్రస్తుతం ఉన్న బ్రాండ్ల మీద కమీషన్లు తీసుకుంటున్నారని చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి ఆమెపై ట్రోల్స్ మొదలు పెట్టారని ఆమె ఆవేదన చెందారు . ఇక తనపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ గురించి భవానీ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. దిశా చట్ట అమలు తనతోనే మొదలు పెట్టాలని కోరారు.
లిక్కర్ బ్రాండ్స్ గురించి సభలో వ్యాఖ్యానించిన ఆదిరెడ్డి భవానీ
ఏపీ అసెంబ్లీలో ఎక్సైజ్ సవరణ చట్ట బిల్లు పై జరిగిన చర్చ నేపధ్యంలో ఆదిరెడ్డి భవానీ మద్యం పాలసీ గురించి మాట్లాడారు.మద్యం విషయంలో ప్రభుత్వం తీరు చూస్తుంటే మద్యం నియంత్రిస్తున్నట్లు ప్రజలకు భ్రమ కల్పిస్తోందని చెప్పారు. షాపులు తగ్గించామని చెప్తున్నా కానీ మద్యం షాపుల ద్వారా ధరలు పెంచడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం బాగానే వస్తుందని ఆమె పేర్కొన్నారు. గతంలో లిక్కర్ బ్రాండ్స్ చాలా ఉండేవని పేర్కొన్న భవాని ఇప్పుడు తగ్గిపోయాయని మాట్లాడుతుండగా స్పీకర్ తో సహా సభ్యులందరూ నవ్వుకున్నారు.
లిక్కర్ బ్రాండ్ల గురించి నీకెందుకు తల్లీ అని స్పీకర్ వ్యాఖ్య
ఆదిరెడ్డి భవానీ మాట్లాడిన తర్వాత ఆ తర్వాత సంబంధిత మంత్రి, స్పీకర్ తమ్మినేని ఆమె మాటలకు బదులిచ్చారు. అయితే ఇవాళ మరోసారి అసెంబ్లీలో మాట్లాడిన ఆమె మద్యం పాలసీపై మాట్లాడే హక్కు తనకు లేదా? అని ప్రశ్నించారు. ఇక స్పీకర్ కూడా తాను మాట్లాడే అంశాన్ని పూర్తి చెయ్యకుండానే లిక్కర్ బ్రాండ్ల గురించి నీకెందుకు తల్లీ అని అవహేళనగా మాట్లాడారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు .మద్యంపై నేను అనని మాటలను అన్నట్టుగా వక్రీకరించి నాపై సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని అసెంబ్లీలో ఆమె అసహనంతో మాట్లాడారు.
సోషల్ మీడియాలో ట్రోల్స్..దిశ చట్టం అమలు నాతోనే మొదలుపెట్టండన్న ఎమ్మెల్యే
తనపై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్న నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాపై ట్రోల్ చేసినవారిలో వైసీపీ కార్యకర్తలు కూడా ఉన్నారని ఆమె పేర్కొన్నారు.. దిశ చట్టం అమలు నాతోనే మొదలుపెట్టండి అని స్పీకర్ను ఆదిరెడ్డి భవాని కోరారు. నిన్న ఏపీ అసెంబ్లీ లో మద్యపాన నిషేధం పై జరిగిన చర్చలో ఆదిరెడ్డి భవానీ మాట్లాడిన సమయంలో చోటు చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
స్పీకర్ వ్యాఖ్యలతో నవ్వుకున్న సభ్యులు .. మనస్తాపానికి లోనైన భవానీ
మద్యం అక్రమ విక్రయాలపై, రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన ఏపీ సర్కార్ ఎక్సైజ్ చట్టంలో పలు సవరణలు చేయాలని భావించింది. అందుకే నేడు సభలో ఈ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో జరిగిన చర్చలో టీడీపీ సభ్యులు మద్యపాన నిషేధంపై మాట్లాడారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని చేసిన వ్యాఖ్యలకు స్పీకర్ చేసిన ప్రతివ్యాఖ్యలు సభలో అందర్నీ ఒక్కసారిగా నవ్వుకునేలా చేశాయి. దీంతో ఆమెపై నెటిజన్లు ట్రోల్స్ మొదలుపెట్టారు. దీంతో భవానీ తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు.