కోవాగ్జిన్ వ్యాక్సిన్ వాలంటీర్లుగా టీడీపీ ఎమ్మెల్యే దంపతులు- ఏపీలో ఇదే తొలిసారి
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చురుగ్గా పరిశోధనలు నిర్వహిస్తున్న సంస్ధల్లో మన దేశానికి చెందిన హైదరాబాదీ సంస్ధ భారత్ బయోటెక్ కూడా ఒకటి. తాజాగా ఈ సంస్ధ నిర్వహించిన ట్రయల్స్ విజయవంతం అవుతుండటంతో దేశంలో అత్యవసర పరిస్ధితుల్లో వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కూడా కోరింది. తెలుగు రాష్ట్రాలకే చెందిన ప్రతిష్టాత్మస సంస్ధ భారత్ బయోటెక్ పరిశోధనలు ఇప్పుడు మన దేశంతో పాటు ప్రపంచం దృష్టిని కూడా ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ బయోటెక్ చేస్తున్న పరిశోదనల్లో ఓ టీడీపీ ఎమ్మెల్యే కుటుంబం కూడా భాగస్వామి అవుతోంది.
భారత్ బయోటెక్ ట్రయల్స్
హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్ధ తాము తాజాగా అబివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్పై ట్రయల్స్ నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 25 ప్రాంతాల్లో భారత్ బయోటెక్ ఈ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ప్రస్తుతం రెండు దశలు పూర్తి చేసుకుని మూడోదశకు ఈ ట్రయల్స్ చేరాయి. వీటిలో మంచి ఫలితాలు వెలువడుతున్నాయి. దీంతో తమ టీకా విజయవంతంగా పనిచేస్తోందని, దేశీయంగా అత్యవసర పరిస్ధితుల్లో వినియోగానికి అనుమతి ఇవ్వాల్సిందిగా డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియాను భారత్ బయోటెక్ కోరింది. ఈ అభ్యర్ధనను కేంద్రం తీవ్రంగా పరిశీలిస్తోంది. దీంతో ఈ ప్రతిష్టాత్మక ప్రయోగాల్లో భాగస్వాములయ్యేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు.
వాలంటీర్లుగా టీడీపీ ఎమ్మెల్యే గద్దె దంపతులు..
కృష్ణాజిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఆయన సతీమణి, జిల్లా పరిషత్ మాజీ ఛైర్పర్సన్ గద్దె అనురాధ కూడా ఈ ట్రయల్స్లో భాగస్వాములయ్యారు. ఈ నెల 7న గుంటూరు ఫీవర్ ఆస్పత్రిలో నిర్వహించిన ట్రయల్స్లో పాల్గొని వీరు కోవాగ్జిన్ టీకా వాలంటీర్లుగా మారిపోయారు. ఇకపై జనవరి నుంచి మార్చి వరకూ ప్రతీ నెలా 4వ తేదీన వీరికి టీకా వేయబోతున్నారు. ప్రతీ 15 రోజులకోసారి గుంటూరులోని ఫీవర్ ఆస్పత్రిలో ఉన్న భారత్ బయోటెక్ ల్యాబ్లో వీరు పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. తొలి విడత టీకా తర్వాత ఎలాంటి ఆరోగ్య సమస్యలూ ఎదుర్కోలేదని గద్దె రామ్మోహన్ దంపతులు చెబుతున్నారు. దీంతో వీరికి తదుపరి టీకా రెగ్యులర్గా వేసేందుకు భారత్ బయోటెక్ ఏర్పాట్లు చేస్తోంది.
Recommended Video
వాలంటీర్లుగా ప్రజాప్రతినిధులు- ఏపీలో ఇదే తొలిసారి
ఇప్పటివరకూ ఏపీలో ప్రజాప్రతినిధులు ఎవరూ టీకా ట్రయల్స్లో పాలుపంచుకోలేదు. ప్రజాప్రతినిధులే కాదు సమాజంలో ఉన్నత స్ధానాల్లో ఉన్న వారెవరూ ఈ రిస్క్ చేసేందుకు ముందుకు రాలేదు. కానీ తొలిసారి ఉన్నత విద్యావంతులైన టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దంపతులు కోవాగ్జిన్ టీకా వాలంటీర్లుగా మారడంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా మహమ్మారిపై ప్రపంచవ్యాప్తంగా జరిగే పోరులో తామూ భాగస్వాములు కావాలనే టీకా వాలంటీర్లుగా మారినట్లు గద్దె దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. స్వయంగా మైక్రో బయాలజిస్ట్ అయిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కు గతంలో పలు పరిశోధనల్లో పాల్గొన్న అనుభవం కూడా ఉంది. దీంతో ఈ ప్రయోగాల్లో సాధకబాధకాలు తెలిసే ముందుకొచ్చినట్లు ఆయన వెల్లడించారు.