త్వరలో వైసీపీలోకి గంటా- విశాఖ ఎన్నికల వేళ బాంబుపేల్చిన సాయిరెడ్డి
విశాఖ నగర పాలక సంస్ధకు జరుగుతున్న ఎన్నికల్లో గట్టిపోటీ ఎదుర్కొంటున్న వైసీపీ వ్యూహాత్మక ఎత్తుగడలకు తెరలేపింది. ఎప్పటి నుంచో వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్కు ఎట్టకేలకు ద్వారాలు తెరిచింది. ఈ మేరకు గంటా శ్రీనివాస్ పెట్టిన పలు షరతులను అంగీకరించేందుకు వైసీపీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
విశాఖ నగర పాలక సంస్ధ జీవీఎంసీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న వైసీపీ కీలక నేతలను పార్టీలో చేర్చుకుంటోంది. ఇందులో భాగంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ అనుచరుడు కాశీ విశ్వనాథ్ను ఇవాళ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తమ పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన విజయసాయిరెడ్డి వైసీపీలోకి గంటా చేరికపై సంకేతాలు ఇచ్చేశారు. జగన్ పాలన చూసి చాలా మంది వైసీపీలో చేరుతున్నారని, ఇదే క్రమంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ కూడా వైసీపీలో చేరేందుకు కొన్ని ప్రతిపాదనలు చేశారని, వాటిని సీఎం జగన్ పరిశీలించి ఆమోదించాక ఆయన చేరిక ఉంటుందని వెల్లడించారు.
అయితే వైసీపీలో గంటా చేరికను గట్టిగా వ్యతిరేకిస్తున్న వైసీపీ నేతలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఇందులో గంటాకు ఒకప్పటి మిత్రుడు, స్ధానిక మంత్రి అవంతి శ్రీనివాస్తో పాటు మరికొందరు కూడా ఉన్నారు. వీరంతా గంటా చేరికను ఎప్పటినుంచో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ప్రస్తుతం జీవీఎంసీ ఎన్నికల్లో నెగ్గాలంటే గంటా సాయం తప్పనిసరని భావిస్తున్న వైసీపీ ఆయనకు గ్రీన్సిగ్నల్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ వెల్లడించారు.