రాజధానిపై చంద్రబాబుకు షాక్ ఇచ్చిన గంటా.. ప్రభుత్వ నిర్ణయానికి స్వాగతం...
ఏపీ అసెంబ్లీ చివరి రోజు సమావేశాల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజధానిపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రాజధానిపై చేసిన వ్యాఖ్యలను పలు పార్టీలు స్వాగతిస్తుండగా...టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ నేపథ్యంలోనే సీఎం నిర్ణయాన్ని ఓ తుగ్లక్ చర్యగా చంద్రబాబునాయుడు అభివర్ణించారు. రాజధాని ప్రకటన తర్వాత పార్టీ సీనియర్ నేతలతో సమావేశమైన చంద్రబాబు అమరావతే రాజధాని అనేదే పార్టీ విధానమని చంద్రబాబు స్పష్టం చేశారు.
అయితే పార్టీ నిర్ణయంపై భిన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. అమరావతి నిర్మాణంలో భాగంగా విశాఖ పట్నంలో పరిపాలన విభాగం ఉంటాయన్న సీఎం ప్రకటనను టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. ఈ నేపథ్యంలోనే సహజసిద్దమైన సముద్ర తీరం ఉన్న నగరం విశాఖ నగరాన్ని పరిపాలన రాజధానిగా చేయడం మంచి నిర్ణయమని పేర్కొన్నారు.
విశాఖ , రోడ్డు, రైలు, ఎయిర్ మరియు నీటీ లభ్యత ఉన్న నగరమని , ప్రభుత్వ నిర్ణయం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఉందని అన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో విశాఖ విశ్వనగరంగా మారడం ఖాయమని అన్నారు. ఇందుకోసం విశాఖ ప్రజలు పూర్తి సహాకారాన్ని ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారని గంటా తెలిపారు. అయితే ఎంపీ కేశినేని నాని మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.