వైసీపీలోకి గంటా..షరతులకు అంగీకారం!! చక్రం తిప్పిన సాయిరెడ్డి: ఆయనే అడ్డు పడుతున్నారా..!!
Recommended Video
విశాఖలో టీడీపీ నేతల వలసలు మొదలయ్యాయి. టీడీపీలోని ముఖ్యులను తమ పార్టీల్లో చేర్చుకొనేందుకు వైసీపీ..బీజేపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. కొద్ది కాలంగా పార్టీ మారుతారనే ప్రచారం సాగుతున్నా..ఖండించిన మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు వైసీపీలోకి రావటానికి రూట్ క్లియర్ అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందుకోసం ముఖ్యమంత్రి జగన్ నిర్ధేశించిన షరతులకు గంటా అంగీకరించారని తెలుస్తోంది. త్వరలో జరిగే గ్రేటర్ విశాఖ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుంటూ అక్కడి నేతలను తమ వైపు తిప్పుకొనేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు బీజేపీలో వెళ్లటం ఖరారైంది. అయితే, గంటా చేరిక పైన ఆయన మాజీ స్నేహితుడు..ప్రస్తతు మంత్రి అవంతి శ్రీనివాస రావు నుండే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో..వైసీపీ ముఖ్య నేత విజయ సాయిరెడ్డి రంగంలోకి దిగి..గంటా రాకకు మార్గం సుగమం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. త్వరలోనే గంటా టీడీపీకి..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరుతారనే ప్రచారం విశాఖ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.
వైసీపీలోకి గంటా ఎంట్రీ ఖాయమేనా...!!
మాజీ మంత్రి..టీడీపీ ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు వైసీపీలో చేరటం ఖాయమనే ప్రచారం విశాఖలో జోరుగా సాగుతోంది. కొద్ది రోజుల క్రితం ఆయన బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం సాగింది. అయితే గంటా తాను టీడీపీ వీడటం లేదని ఖరా ఖండిగా చెప్పేసారు. ఇక, ఇప్పుడు విశాఖలోని టీడీపీ నేతల్లో కొందరు పార్టీ మారేందుకు సిద్దపడుతున్నారు. అనకాపల్లి నుండి తాజా ఎన్నికల్లో టీడీపీ ఎంపీ అభ్యర్దిగా పోటీ చేసిన కిడారి ఆనంద్ సెప్టెంబర్ 1న వైసీపీ లో చేరటానికి ముహూర్తం ఖరారైంది. అదే విధంగా పంచకర్ల రమేష్ బాబు సైతం బీజేపీలో చేరాలని నిర్ణయించారు. ఇక, ఇప్పుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు పేరు ప్రచారంలోకి వచ్చింది. వైసీపీ ముఖ్య నేత విజయ సాయిరెడ్డి ఎన్నికల సమయంలోనే గంటా తమ పార్టీలోకి వస్తారంటూ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. కానీ, ఆయన టీడీపీలో ఎన్నికల్లో పోటీ చేసారు. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీలో కంఫర్ట్ గా లేని గంటాతో బీజేపీ నేతలు టచ్ లోకి వెళ్లారు. బీజేపీ జాతీయ నేత రాం మాధవ్ నేరుగా గంటాను తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అయితే, బీజేపీలో చేరటం ద్వారా రాజకీయంగా ప్రయోజనం ఉంటుందా..ఉందడా అనే సంశయంతో గంటా నిర్ణయం తీసుకోలేదు. ఇక, ఇప్పుడు ఏపీలో వైసీపీ అధికారంలో ఉండటం... విశాఖలో తనకున్న ఇబ్బందుల కారణంగా వైసీపీలోకి వెళ్లటమే మంచిదనే అభిప్రాయానికి ఆయన వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, అదే సమయంలో తనకు వైసీపీలో ఉన్న ఇబ్బందులను ఆయన ప్రస్తావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
వైసీపీ షరుతులకు అంగీకారం...!!
ఇతర పార్టీల్ల ఎమ్మెల్యేగా ఉన్న వారు తమ పార్టీలోకి రావాలంటే ఖచ్చితంగా పదవికి రాజీనామా చేసి రావాల్సిందేనని ముఖ్యమంత్రి జగన్ శాసనసభా వేదికగా స్పష్టం చేసారు. అయితే, ఇప్పుడు వైసీపీ నేతలు గంటాతో జరుపుతున్న చర్చల్లో ఈ అంశం పైన గంటా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా..ఉప ఎన్నికల్లో పోటీ చేయటానికి సిద్దంగా లేరని సమాచారం. అయితే పార్టీలో కీలక పదవి..లేదా ఎమ్మెల్సీ ఇచ్చే విధంగా చర్చలు సాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. గతంలోనే టీడీపీలోని కాపు నేతలు కాకినాడలో సమావేశమయ్యారు. వారంతా పార్టీ వీడుతారనే ప్రచారం సైతం సాగింది. కానీ, వారు పార్టీ మారలేదు. ఆ సమావేశానికి గంటా దూరంగా ఉన్నారు. గంటాకు ప్రతిపక్షానికి దక్కే పీఏసీ పోస్టును చంద్రబాబు తనకు కాకుండా పయ్యావుల కేశవ్ కు కేటాయించటం పైనా గంటా మనస్థాపానికి గురైనట్లు ప్రచారం సాగింది. అదే సమయంలో టీడీపీలోని కాపు నేతలు కొద్ది రోజులుగా కాపు వర్గానికి టీడీపీలో ప్రాధాన్యత లేదని ప్రచారం చేస్తూ పార్టీ వీడుతున్నారు. తాజాగా తూర్పు గోదావరి ప్రత్తిపాడు టీడీపీ నేత వరుపుల రాజీ సైతం ఇవే ఆరోపణలు చేస్తూ టీడీపీకి రాజీనామా చేసారు. ఇక, గంటాకు రాజకీయంగా టీడీపీలోని ఇతర నేతలతో బంధుత్వం ఉంది. అందులో ప్రధానంగా మాజీ మంత్రి నారాయణ పైన రాజధాని వ్యవహారాల్లో వైసీపీ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తాను వైసీపీకి వెళ్లటం ద్వారా ప్రయోజనం ఉంటుందని గంటా అంచనా వేస్తున్నారని ప్రచారం సాగుతోంది.
మంత్రి అవంతి అయిష్టత..
ప్రజారాజ్యం నుండి తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల వరకు గంటా..అవంతి రాజకీయంగా మంచి స్నేహితులు. ఇద్దరూ ప్రజారాజ్యంలో పని చేయటం..కలిసి టీడీపీకి రావటం..కలసి పని చేయటం జరిగింది. అయితే, అవంతి శ్రీనివాస్ టీడీపీని వీడి వైసీపీలో చేరిన సమయంలో ఇద్దరి మధ్య పరస్పర విమర్శలు చోటు చేసుకున్నాయి. వ్యక్తిగత ఆరోపణలు చేసుకున్నారు. అవంతి శ్రీనివాస్ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో మంత్రి గా ఉన్నారు. గంటా శ్రీనివాస్ వైసీపీలోకి రావటాన్ని అవంతి ఇష్టపడటం లేదని సమాచారం. దీంతో..పార్టీ ముఖ్యనేత విజయ సాయిరెడ్డి రంగంలోకి దిగారని చెబుతున్నారు. త్వరలో విశాఖ గ్రేటర్ ఎన్నిక లు జరగనున్నాయి. అక్కడ పాగా వేయాలంటే అందరినీ కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో వైసీపీ అధినాయకత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగానే.. బీజేపీ ముఖ్య నేత రాం మాధవ్ తమ పార్టీలోని రమ్మని.. వైసీపీ నుండి విజయ సాయిరెడ్డి టచ్ లో ఉండటంతో ఇప్పుడు గంటా తుది నిర్ణయం ఎలా ఉంటుందీ.. ఎలా రియాక్ట్ అవుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది.