చంద్రబాబూ! జగన్ను చూసి నేర్చుకో: మేం ప్రజలకు దూరం: ఏడాది పాలన సూపర్: టీడీపీ ఎమ్మెల్యే
ఒంగోలు: తెలుగుదేశం పార్టీలో మరో అసమ్మతి గళం వినిపించింది. ఏకంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి విధానాలపైనే అసంతృప్తిని వ్యక్తి చేసింది. ఆయన అనుసరించిన విధానాల వల్లే ప్రజలకు దూరం కావాల్సి వచ్చిందనే ఆవేదనను వ్యక్తం చేసింది. ఆ గళాన్ని వినిపించింది మరెవరో కాదు.. ఆవిర్భావం నుంచీ పార్టీలో కొనసాగుతోన్న సీనియర్ నాయకుడు, ప్రకాశం జిల్లా చీరాల శాసన సభ్యుడు కరణం బలరామ కృష్ణమూర్తి.
అందుకే ఛీత్కారం..
తెలుగుదేశం పార్టీలో డైహార్డ్ లీడర్గా గుర్తింపు కరణం బలరాం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. పార్టీ ప్రజలకు దూరమైందనే విషయాన్ని తాను అంగీకరిస్తున్నానని చెప్పారు. దీనికి ప్రధాన కారణం చంద్రబాబు అనుసరించిన విధానాలేనని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించాలనే అకాంక్షతో తప్ప ప్రజల కోసం ఏనాడు చంద్రబాబు పని చేయలేదని కరణం బలరాం ఆరోపించారు. అందుకే ప్రజలు ఛీత్కరిస్తున్నారని స్పష్టం చేశారు. తమ
జగన్ ఏడాది పాలన అద్భుతం..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలన అద్భుతంగా ఉందని కరణం బలరాం కితాబిచ్చారు. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేశారని ప్రశంసించారు. రాష్ట్ర చరిత్రలో అధికారంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను ఇంత వేగంగా అమలు చేయలేదని అన్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో వైఎస్ జగన్ వంటి ప్రజలు మెచ్చిన నాయకుడిని చూడలేదని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలనే సరికొత్త రాజకీయానికి వైఎస్ జగన్ తెర తీశారని అన్నారు. జగన్ను చూసి చంద్రబాబు నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పారు.
రాజకీయంగా విభేధాలు ఉన్నా..
రాజకీయంగా విభేధాలు ఉన్నప్పటికీ.. ముఖ్యమంత్రి పని తీరును తాను అభినందించకుండా ఉండలేకపోతున్నానని కరణం బలరాం అన్నారు. ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసమే అనే నమ్మకాన్ని కలిగిస్తోందని, రాజకీయాల్లో ఇది ఒక నూతన ఒరవడికి నాంది పలుకుతుందని చెప్పారు. ఒకట్రెండు లోపాలు ఉన్నమాట వాస్తవమేనని, దాన్ని సరిదిద్దుకోవాలని ఓ ఎమ్మెల్యేగా ప్రభుత్వానికి సూచిస్తున్నానని అన్నారు. తొలి ఏడాదిలోనే 90 శాతం మేర హామీలను నెరవేర్చిన సంక్షేమ ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకుందని ప్రశంసించారు.
Recommended Video
ప్రతి విషయంపైనా విమర్శలు మానుకోవాలి..
తెలుగుదేశం పార్టీ ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలోంచి చూస్తోందని, అది సరి కాదని కరణం బలరాం చెప్పారు. ప్రస్తుతం తాము చేస్తోన్న అంశాలపై విమర్శలను చూస్తోంటే.. తమను తామే నిందించుకున్నట్లుగా అవుతోందని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన కొన్ని పొరపాట్లు వైసీపీ ప్రభుత్వం చేసిందని, దాన్ని విమర్శించడం సరికాదని పరోక్షంగా రంగుల ఉదంతాన్ని కరణం బలరాం ప్రస్తావించారు. వెలిగొండ ప్రాజెక్టును తమ ప్రభుత్వం నిర్లక్ష్యంగా చేయగా.. జగన్ ప్రభుత్వం దాన్ని పనులను కొనసాగిస్తుండటం జిల్లా ప్రజలకు మేలు చేస్తుందని అన్నారు.