కిడారి హత్య ఎఫెక్ట్: రక్షణ కావాలి.. హైకోర్టుకు జగన్ పార్టీ నేత ధర్మాన, హిట్ లిస్ట్ ఈశ్వరి!
శ్రీకాకుళం/అరకు: ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమల హత్య నేపథ్యంలో ఉత్తరాంధ్రలో మావోయిస్టులు మరోసారి తమ బలం చూపించారు. మావోయిస్టులు తిరిగి పుంజుకోవడం నేతల్లో కలకలం రేపుతోంది. నేతల హత్య నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ధర్మాన ప్రసాద రావు అప్రమత్తమయ్యారు.
అశోక్ గజపతి మాట్లాడలేదు, నా భార్యపై అక్రమ కేసులు పెట్టాలని: తొలి అభ్యర్థిని ప్రకటించిన జగన్
నాకు సెక్యూరిటీ కావాలి
ఆయన హైకోర్టుకు వెళ్లారు. తనకు 2+2 సెక్యూరిటీ భద్రత ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్ పోలీసులను ఆదేశించాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ఏపీ చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ టు హోమ్, స్టేట్ సెక్యూరిటీ రీవ్యూ కమిటీ, శ్రీకాకుళం ఎస్పీ, ఇంటెలిజెన్స్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ల పేర్లను పేర్కొన్నారు.
ఉత్తరాంధ్రలో మావోయిస్టుల కదలికలు
ఉత్తరాంధ్రలో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉన్నాయని, ఇటీవల ఇద్దరిని హత్య చేశారని, తనకు ప్రాణహానీ ఉందని పేర్కొన్నారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చింది. విచారించిన జస్టిస్ రాజశేఖర రెడ్డి.. అంగరక్షకులను కేటాయించాలని కోరుతూ గతంలో ధర్మాన దాఖలు చేసిన వ్యాజ్యంతో దీనిని జతచేసి విచారణకు వేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. బుధవారం విచారణ చేపట్టనున్నారు.
మావోల హిట్ లిస్టులో గిడ్డి ఈశ్వరి!
పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సోమవారం గట్టి భద్రత మధ్య చింతపల్లి మండలంలో పర్యటించారు. అరకులోయ ఎమ్మెల్యే కిడారి, సివేరి సోమలను మావోయిస్టులు కాల్చి చంపిన నేపథ్యంలో, ఈశ్వరి కూడా హిట్ లిస్టులో ఉన్నారని చెబుతున్నారు. దీంతో ఎమ్మెల్యే ఈశ్వరికి పోలీసులు భద్రతను పెంచారు. ప్రజాప్రతినిధిని అయిన తాను ప్రజల వద్దకు వెళ్లకుండా ఎలా ఉండగలనని, తాను మావోయిస్టుల టార్గెట్లో లేనని ఆమె పోలీసు అధికారులకు చెప్పారని సమాచారం. తనకు అసాధారణ భద్రత అవసరంలేదని చెప్పినప్పటికీ, అధికారులు మాత్రం ఆమె భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.
కట్టుదిట్టమైన భద్రత
సోమవారం చింతపల్లి మండలం బైలుకించంగి గ్రామంలో ఈశ్వరి పర్యటించారు. అంతకుముందు జి.మాడుగులలోనూ పర్యటించారు. జి.మాడుగుల నుంచి చింతపల్లి చేరుకునే మార్గంలో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. అయిదు బాంబ్స్క్వాడ్ బృందాలు రోడ్డు, సభా ప్రాంగణాన్ని తనిఖీ చేశాయి. సభా ప్రాంగణానికి చుట్టూ సుమారు రెండు కి.మీ. పరిధిని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సభా వేదిక పక్కనున్న వాటర్ ట్యాంకుపై సాయుధ పోలీసులు పహారా కాశారు.