తమ రాజకీయ ఎదుగుదలకు కిడారి అడ్డుగా ఉంటున్నాడని! కాల్ డేటాలో కీలక ఆధారాలు
అరకు: తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమలను మావోయిస్టులు హత్య చేసేందుకు దగ్గరి వారే సహకరించారని ఆరోపణలు వినిపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై మావోయిస్టులు ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు. కిడారికి సన్నిహితంగా ఉంటూనే పలువురు మావోలసు సమాచారం ఇచ్చారు.
ఆత్మీయుల వంచన: కిడారి హత్యకు బంధువులే మావోలకు సమాచారం ఇచ్చారు
లివిటిపుట్టు, అంత్రిగూడ గ్రామస్తులను పోలీసులు వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థుల ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. కాల్ డేటా విశ్లేషణలో కీలక ఆధారాలు లభ్యమైనట్లుగా తెలుస్తోంది. కిడారి, శివేరిల హత్యకు ఆరుగురు సహకరించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వివిధ పార్టీలకు చెందిన నేతల పాత్ర ఉందని భావిస్తున్నారు.
తమ ఎదుగుదలకు అఢ్డుగా ఉన్నాడని
ఆరుగురిలో ముగ్గురికి టీడీపీ, ఇద్దరికి వైసీపీ, ఒకరికి బీఎస్పీతో సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరు అరకు, పాడేరు, డుంబ్రిగీడ, హుకుంపేట, జి.మాడుగుల మండలాలకు చెందిన వారుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్న స్థానిక చోటా నాయకులకు మావోయిస్టులు వల వేసి, సహకారం తీసుకున్నారు. మరోవైపు తమ రాజకీయ ఎదుగుదలకు కిడారి అడ్డుగా ఉన్నాడని భావించిన పలువురు నేతలు వారికి సహకరించారని తెలుస్తోంది.
వారి అసంతృప్తిని క్యాష్ చేసుకున్న మావోయిస్టులు
మావోయిస్టులకు సమాచారం అందించిన వారిలోని ఓ నాయకుడు సన్నిహితుడు ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తున్నారట. ఈ నేపథ్యంలో కిడారి సర్వేశ్వర రావు, శివేరి సోమలు ఒక్కటి కావడంతో ప్రత్యర్థి వర్గం నీరుగారిపోయిందని అంటున్నారు. వీరి అసంతృప్తిని మావోయిస్టులు క్యాష్ చేసుకున్నారని చెబుతున్నారు. సదరు నేత.. ఎమ్మెల్యే కదలికలపై కన్నువేసి మావోయిస్టులకు సమాచారం చేరవేశాడని తెలుస్తోంది.
ముగ్గురు అధికారులు ఇతర రాష్ట్రాలవారే
ఇదిలా ఉండగా, ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాకు ఎస్పీ, ఏఎస్పీ, ఓఎస్టీ.. ముగ్గురు ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. భాషాపరమైన సమస్యతో పాటు పలు ఇబ్బందుల కారణంగా వారికి ప్రజలతో అంతగా సంబంధాలు లేవని అంటున్నారు. పోలీస్ పెద్దలు ఈ లోపాన్ని కూడా గుర్తించారని సమాచారం. కనీసం రెండు పోస్టుల్లో తెలుగు ఐపీఎస్లను నియమించాలని భావిస్తున్నారని తెలుస్తోంది.
ఆప్యాయంగా పలకరించి, ఉప్పందించారు
హత్య జరిగిన రోజు సర్రాయిలో ఏర్పాటు చేసిన గ్రామదర్శినికి హాజరు కావాలని కిడారికి వచ్చిన ఓ ఫోన్ కాల్ ఆయన పాలిట మృత్యువు అయిందని చెబుతున్నారు. ఆ కాల్ వల్లే విశాఖపట్నం వెళ్లాల్సిన ఆయన వెనక్కి మళ్లీ, మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆ కాల్ చేసింది ఎవరు అని పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి యువనేస్తంకు సంబంధించిన బ్యానర్లు, కరపత్రాలు తీసుకొని నేరుగా విశాఖపట్నం బయలుదేరే సమయంలో, ఎమ్మెల్యే కిడారికి ఫోన్ వచ్చింది. సర్రాయి గ్రామదర్శినికి తప్పనిసరిగా రావాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. అప్పటికే గ్రామదర్శిని గురించి ఎమ్మెల్యేకు తెలిసినా కచ్చితంగా వెళ్లాలని భావించలేదు. కార్యకర్తలు, స్థానిక నేతలు అడిగితే చూద్దామని చెప్పారు. ఆయన ఎస్ కోటలో ఉండగా వచ్చిన ఫోన్ కాల్తో వెనుతిరగక తప్పలేదు. రాత్రికి రాత్రే మరలా అరకులోని క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఆదివారం సర్రాయికి వెళుతూ లివిటిపుట్టు వద్ద మావోల చేతిలో హతమయ్యారు. విశాఖ వెళ్దామనుకున్న అతనికి ఫోన్ చేసింది ఎవరు, దారి మళ్లించింది ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. హత్య అనంతరం పోలీసులు కిడారి సెల్ ఫోన్ తీసుకొని వెళ్లిపోయారు. ఎమ్మెల్యే దగ్గర రెండు ఫోన్లు ఉంటే మావోయిస్టులు యాపిల్ ఫోన్ని వదిలేసి మరో ఫోన్ మాత్రమే తీసుకు వెళ్లారు. ప్రస్తుతం ఈ యాపిల్ ఫోన్ పోలీసుల దగ్గరే ఉందని తెలుస్తోంది. కిడారిని దారి మళ్లించిన ఫోన్కాల్ ఎవరిదో తెలుసుకునేందుకు కాల్డేటాను విశ్లేషిస్తున్నారు. ఆ సమాచారంతో అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. డుంబ్రిగుడకు చెందిన స్థానిక అధికార పార్టీ నేతలను పోలీసు గెస్ట్ హౌస్కు తీసుకు వచ్చి చాలాసేపు విచారించారు. ఇప్పటికే పీవీటీజీ గ్రామం అంత్రిగుడ నుంచి కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా గ్రామదర్శిని చేయాల్సిన సర్రాయి గ్రామానికి చెందిన 15 మందిని విచారణకు తీసుకువచ్చారు. అరకు మండలానికి చెందిన ఓ మహిళా ప్రజాప్రతినిధిని కూడా పోలీసులు విచారించారని తెలుస్తోంది. ఈ హత్యల వెనుక స్థానిక నేతల సహకారం ఉందని భావిస్తున్నారు. గ్రామదర్శినికి రావాలని ఒత్తిడి చేయకుంటే ఈ ఘాతుకం జరిగి ఉండేది కాదని అంటున్నారు.
కిడారిని బావా.. బావా అంటూ ఆప్యాయంగా పిలిచిన ఓ వ్యక్తి మావోయిస్టులకు సమాచారం చేరేవేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అతను శివేరి సోమకు దగ్గరి బంధువు కూడా అవుతారని తెలుస్తోంది. అతనితో పాటు మరికొందరిని పావులుగా ఉపయోగించుకోని మావోయిస్టులు వీరిని హత్య చేశారు. కిడారికి సన్నిహితంగా ఉండే ఆ వ్యక్తితో పాటు అతని భార్యను పోలీసులు అదుపులోకి తీసుకొని నాలుగు రోజులుగా విచారణ చేస్తున్నారని తెలుస్తోంది. భార్యాభర్తలను వేరుగా, కలిపి ప్రశ్నించారు. వారు ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నారని తెలుస్తోంది. పోలీసుల ప్రశ్నలకు ఆ భార్యాభర్తలు నీళ్లు నమిలారని తెలుస్తోంది. వీరి హత్య కేసులో టీడీపీతో పాటు వైసీపీ, బీఎస్పీ స్థానిక నేతల పాత్ర ఉందని భావిస్తున్నారు.