నోరు మెదపరేంటి చంద్రబాబూ!: పెద్ద కుంభకోణాలే ఉన్నాయంటూ టీడీపీ ఎమ్మెల్యే సంచలనం
అమరావతి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆ పార్టీ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఐటీ సోదాలపై స్పందిస్తూ.. ఇప్పటి వరకు బయటకు వచ్చినవి చాలా తక్కువే అని అన్నారు.
చంద్రబాబు ఖాతాలో పెద్ద కుంభకోణాలే..
చంద్రబాబు ఖాతాలో ఇంకా పెద్ద కుంభకోణాలే ఉన్నాయని ఎమ్మెల్యే మద్దాలి గిరి ఆరోపించారు. త్వరలోనే అవన్నీ బయటకు వస్తాయన్నారు. ఐటీ అధికారులు నిర్వహించిన సోదాల్లో చంద్రబాబు, ఆయన సన్నిహితుల అవినీతి బండారం బట్టబయలైందన్నారు.
నోరు మెదపడం లేదు ఎందుకో?
ఎప్పుడూ నీతి, నిజాయితీకి మారు పేరు అంటూ చెప్పుకునే చంద్రబాబు నాయుడు.. ఇప్పుడేం సమాధానం చెబుతారని ఎమ్మెల్యే గిరిధర్ ప్రశ్నించారు. ఇంత జరిగినా చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని చంద్రబాబు అక్రమాలపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
చంద్రబాబును మించిన ఘనుడు లేడు..
చంద్రబాబు, అతని సన్నిహితులపై నిష్పక్షపాతంగా విచారణ జరిపితే వాస్తవాలు బయపడతాయని ఎమ్మెల్యే గిరి వ్యాఖ్యానించారు. ఇంత జరుగుతున్నా ఎల్లో మీడియా కనీసం స్పందించడం లేదని మండిపడ్డారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబును మించిన ఘనుడు లేడని విమర్శించారు. ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు నాయుడు మాజీ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని మద్దాలి గిరి ఆరోపించారు.
చంద్రబాబే టార్గెట్గా విమర్శల దాడి..
చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ శ్రీనివాస్, ఇతర సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. సుమారు రూ. 2 వేల కోట్ల వరకు పత్రాలు లేని సొమ్ము ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రజాప్రతినిధులు, నేతలు చంద్రబాబు, టీడీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా, 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలుపొందారు మద్దాలి గిరిధర రావు. అయితే, ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసిన ఆయన.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి, మద్దతు ప్రకటించారు.