హిందూపురంలో బాలయ్యకు తృటిలో తప్పిన ప్రమాదం- సుదీర్ఘ విరామం తరువాత రావడంతో..
తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణకు తృటిలో ప్రమాదం తప్పింది. హిందూపురంలో పర్యటిస్తోన్న సమయంలో వాహనంపై నుంచి తూళ్లి కిందపడబోయారు. అదృష్టవశావత్తూ వెనక్కి పడటంతో ప్రమాదం తప్పింది.
పుట్టపర్తి: తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం హిందూపురంలో పర్యటిస్తోన్నారు. ఇది ఆయన సొంత నియోజకవర్గం. వరుసగా రెండుసార్లు టీడీపీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి ఘన విజయం సాధించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సుదీర్ఘ విరామం తరువాత ఆయన హిందూపురానికి వచ్చారు. ప్రజలతో మమేకం అయ్యారు. రోడ్ షోలను నిర్వహించారు. నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలను ముఖాముఖి కలుసుకున్నారు.
నన్ను ముసలోడివి అంటావా: కొండారెడ్డి బురుజు దగ్గర తేల్చుకుందామా? పవన్ను ఏకి పారేసిన బైరెడ్డి
వివాదాలకు తెర..
తన హిందూపురం పర్యటన సందర్భంగా పలు వివాదాలకు తెర దించే ప్రయత్నం చేశారు బాలకృష్ణ. స్థానిక ఎమ్మెల్యేగా ఉంటూ నియోజకవర్గాన్ని విస్మరించారని, పొరుగు రాష్ట్రం హైదరాబాద్ లో నివసిస్తోన్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తోన్న విమర్శల నేపథ్యంలో ఆయన హిందూపురానికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
వాటికీ వివరణ..
ఇటీవలే అక్కినేని కుటుంబాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి కూడా ముగింపు పలికారు. అక్కినేని.. తొక్కినేని అంటూ చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వర రావు రెండు కళ్లలాంటివారని పేర్కొన్నారు. అక్కినేనిని తాను బాబాయ్ అని పిలిచేవాడినని, పొగడ్తలకు దూరంగా ఎలా ఉండాలో ఆయనను చూసి నేర్చుకున్నానని చెప్పారు. ఫ్లోలో వచ్చే మాటలపై దుష్ప్రచారం చేయడం సరికాదని అన్నారు.
జగన్ పై విమర్శలు..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ముఖ్యమంత్రిపై సెటైర్లు వేశారు. దావోస్ వెళ్లిన వైఎస్ జగన్ దిక్కులు చూస్తూ గడిపారని ఎద్దేవా చేశారు. ఆయనకు భయపడేవాడు ఎవడూ లేడని సవాల్ చేశారు. ఒక్క ఛాన్స్ అని బతిమాలితే ప్రజలు ఓట్లేసి గెలిపించారని, ఆ కృతజ్ఞత కూడా లేకుండా బాదుడే బాదుడు అంటూ అధిక ధరలతో ప్రజల నడ్డి విరిచారని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో మూడు సంవత్సరాల పాటు కాలక్షేపం చేశారని ధ్వజమెత్తారు.
తప్పిన ప్రమాదం..
ల్యాండ్, శాండ్, వైన్ అన్నింటినీ వైసీపీ నాయకులు దోచుకున్నారని బాలకృష్ణ ఆరోపించారు. కాగా- రోడ్ షో నిర్వహిస్తోన్న సమయంలో బాలకృష్ణ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ సాగుతున్న సమయంలో ఆయన నిల్చున్న వాహనం ఒక్కసారిగా ముందుకు కదలడంతో ఆయన తుళ్లి కిందపడబోయారు. తమాయించుకుని అక్కడికక్కడే కూర్చుండిపోయారు. వాహనం జర్క్ ఇచ్చి కదలడంతో ఆయన ఈ ఘటన చోటు చేసుకుంది.
కుప్పానికి..
కాగా- హిందూపురం పర్యటనను ముగించుకుని బాలకృష్ణ చిత్తూరు జిల్లా కుప్పానికి బయలుదేరి వెళ్లనున్నారు. తన అల్లుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహించ తలపెట్టిన పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి హాజరు కానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం కుప్పంలో ఈ యువ గళం పాదయాత్ర ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఇందులో ఆయన భాగస్వామి అవుతారు. తొలిరోజు అల్లుడితో కలిసి అడుగులో అడుగు వేస్తారు.