ఆ ఘన చరిత్ర వైఎస్ జగన్ కే దక్కుతుంది .. నిలదీస్తామనే ఈ రచ్చ : టీడీపీ ఎమ్మెల్యే ధ్వజం
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా తొలిరోజే అసెంబ్లీ రసాభాసగా సాగింది. టిడిపి నేతల సస్పెన్షన్ తో రచ్చ గా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు మాటల దాడికి దిగారు. తుఫాన్ పంటనష్టం విషయంలో అధికార పార్టీ పై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించిన టిడిపి నేతలు వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు రైతు భరోసా లేని వ్యవసాయం చేస్తున్నారని, సీఎం జగన్మోహన్ రెడ్డి తమ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని మరోసారి నిరూపించారు అని మండిపడ్డారు.
ఏ ప్రాంతంలో ఏం పండుతుందో చెప్పాలని లోకేష్ కు బొత్సా సవాల్ ... లోకేష్ సీరియస్
ప్రభుత్వం రైతు సమస్యలపై చర్చకు రాని కారణం ఇదే : నిమ్మల రామానాయుడు
బీఏసీలో పంట నష్టం పై ఒక మాట కూడా మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు నిమ్మల రామానాయుడు. రైతుల ఇబ్బందులపై చర్చిస్తామని చెప్పి, ప్రభుత్వం చర్చకు రాకుండా పోయిందని ఫైర్ అయ్యారు. రైతులకు ఇచ్చే ఇన్సూరెన్స్ ను కూడా ప్రభుత్వం గంగలో కలిపేస్తుంది అని మండిపడ్డారు. టిడిపి హయాంలో రైతులకు నాలుగువేల ఐదు కోట్ల ఇన్సూరెన్స్ ఇచ్చామని కానీ వైసిపి హయాంలో ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నారు కానీ పనులు జరగడం లేదని నిమ్మల రామానాయుడు అసహనం వ్యక్తం చేశారు .
రైతు భరోసా పథకం రైతు దగా పథకం గా మారిందన్న టీడీపీ ఎమ్మెల్యే
రాష్ట్రంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీని 15 వేలకే కుదించడం దారుణమని ఆయన పేర్కొన్నారు. రైతులకు సున్నా వడ్డీతో రుణాలు ఇస్తున్నామని ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలు చేస్తుందని, కేవలం లక్ష లోపు ఉన్న వారికి మాత్రమే ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. టిడిపి హయాంలో 15270 కోట్ల రూపాయలను రైతులకు రైతు భరోసా ఇస్తే ఈ ప్రభుత్వం ఇచ్చింది ఏంటి అంటూ నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. వైసిపి హయాంలో రైతు భరోసా పథకం రైతు దగా పథకం గా మారిందని నిమ్మల రామానాయుడు ఆరోపించారు.
Recommended Video
సభలో నిలదీస్తామనే ఈ రచ్చ అన్న ఎమ్మెల్యే నిమ్మల
టిడిపి హయాంలో రైతులకు అవసరమైన పనిముట్లను సగం ధరకే అందించామని చెప్పిన రామానాయుడు, వైసిపి హయాంలో ఎంతమంది రైతులకు వ్యవసాయ పనిముట్లు అందించిందో చెప్పాలని ప్రశ్నించారు. రాజధాని రైతులు ఇన్ని రోజులుగా పోరాటం చేస్తున్నా వారిని కన్నెత్తి కూడా చూడని ప్రభుత్వమిది అని టిడిపి ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. రైతులకు బేడీలు వేసిన చరిత్ర వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. అధికార పక్షం రైతుల సమస్యలపై సభలో నిలదీస్తామని భయంతోనే చర్చ నుంచి పారిపోయింది అని నిమ్మల రామానాయుడు ఆరోపించారు. రైతుల కోసం వైసీపీ సర్కార్ చేసింది శూన్యమని నిమ్మల పేర్కొన్నారు.