గోదావరి వరదలో చిక్కుకుపోయిన ఎమ్మెల్యే... అధికారులకు చంద్రబాబు ఫోన్... తప్పిన పెను ప్రమాదం...
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లోని నదీ తీర ప్రాంతంలోని గ్రామాలు ముంపుకు గురయ్యాయి. అనేక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని ముంపు గ్రామాల్లో పర్యటనకు వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కూడా వరదలో చిక్కుకుపోయారు. ఆయన ప్రయాణించిన మర పడవ అకస్మాత్తుగా నిలిచిపోవడంతో గోదావరి వరదలో చిక్కుకుపోయారు. అధికారుల సహకారంతో చివరకు సురక్షితంగా బయటపడ్డారు.
బాడవ గ్రామానికి వెళ్తుండగా...
గోదావరి వరద తీర ప్రాంతాలను ముంచెత్తడంతో యలమంచిలి మండలంలోని లంక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. కనకాయలంక, పెదలంక, లక్ష్మీపాలెం, యలమంచిలి లంక, బాడవ గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. దీంతో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బుధవారం(అగస్టు 19) ఆ గ్రామాల్లో పర్యటనకు బయలుదేరారు. బాడవ గ్రామానికి మర పడవలో వెళ్లి తిరిగి వస్తుండగా... యలమంచిలి మండలం చించినాడ వద్ద గోదావరి నదిలో పడవ నిలిచిపోయింది.
రామానాయుడుతో పాటు మరో 15 మంది...
ఆ మరపడవలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుతో పాటు మరో 15 మంది ఉన్నారు. ఇంజన్ చెడిపోవడంతో పడవ మొరాయించింది.ఇదే క్రమంలో గోదావరి ఉధృతికి పడవ కొంత దూరం కొట్టుకెళ్లినట్లు సమాచారం. దీంతో పడవలో ఉన్నవాళ్లంతా ఆందోళన చెందారు. తూర్పు గోదావరి జిల్లా దిండి వైపుగా వెళ్లిన పడవ... అక్కడ కొత్తగా నిర్మిస్తున్న రైల్వే బ్రిడ్జి పిల్లర్లను ఢీకొట్టింది. అయితే పడవ నడుపుతున్న వ్యక్తి... కాస్త చాకచక్యంగా వ్యవహరించి... పడవను ఓ ఒడ్డుకు చేర్చి చెట్టుకు తాడుతో సాయంతో లంగరు వేయడంతో పెను ప్రమాదం తప్పింది.
చంద్రబాబు ఫోన్... సురక్షితంగా బయటపడ్డ ఎమ్మెల్యే...
ప్రమాదంపై ఎమ్మెల్యే జిల్లా అధికారులకు సమాచారం అందించారు. సాంకేతిక లోపంతో గోదావరిలో పడవ చిక్కుకుపోయినట్లు చెప్పారు. ఎమ్మెల్యే రామానాయుడు గోదావరిలో చిక్కుకుయారని తెలియగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరుతో ఫోన్లో మాట్లాడారు. రామానాయుడు సహా ఆ పడవలో ఉన్నవారిని కాపాడాలని కోరారు. జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి ఎన్డీఆర్ఎఫ్ బలగాలకు సమాచారం అందించారు. దీంతో యలమంచిలి ఎస్ఐ గంగాధర్ మరికొందరు సిబ్బంది మరో పడవలో వెళ్లి ఎమ్మెల్యే సహా అందులో ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
వరదలో 1733 ఇళ్లు...
గోదావరి వరద ఉధృతికి లంక గ్రామాలు జల దిగ్బంధమయ్యాయి. దాదాపు 1,733 ఇళ్లు వరద నీటిలో ఉన్నాయని ఎమ్మార్వో నరసింహారావు తెలిపారు. లంక గ్రామాల ప్రజలు ప్రస్తుతం పడవల పైనే రాకపోకలు సాగిస్తున్నప్పటికీ... గోదావరి ఉధృతి పెరగడంతో పడవ ప్రయాణం సురక్షితం కాదన్న వాదన వినిపిస్తోంది. గత రెండు రోజులుగా ఎమ్మెల్యే రామా నాయుడు లంక గ్రామాల్లో పర్యటిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం ఆయన బాడవ గ్రామంలో పర్యటించి వస్తుండగా... గోదావరి వరదలో చిక్కుకుపోయారు.