రూ.100 కోట్ల మట్టి అక్రమంగా తవ్వేశారు...మంత్రి పేరుతోనే: రావెల కిషోర్ బాబు సంచలనం
గుంటూరు: మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిశోర్ బాబు సంచలనాత్మక ఆరోపణలు చేశారు. ఇటీవలి వరకు సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా పనిచేసిన రావెల కిషోర్ బాబు, తాను ఎమ్మెల్యేగా ఉన్న ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలో మంత్రి పుల్లారావు పేరు చెప్పి భారీ ఎత్తున అక్రమ మైనింగ్ చేస్తున్నారని, ఆ విధంగా ఇప్పటికే కనీసం రూ.100కోట్ల మట్టిని తరలించుకుపోయారని ఆరోపించడం సంచలనం రేపింది. అధికార పార్టీ ఎమ్మెల్యే అదే పార్టీకి చెందిన మంత్రిపై ఆరోపణలు చేయడం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.
గుంటూరు స్వర్ణభారతీ నగర్ లో రెవిన్యూ అధికారులు ఓంకార దేవాలయాన్ని కూల్చివేయడం వివాదానికి దారితీసింది. దీంతో సంఘటనా స్థలాన్ని బుధవారం ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ దేవాలయం పడగొట్టి ఇక్కడ ప్లాట్లు వేసి అమ్ముకోవాలని చూస్తున్నారని రావెల ఆరోపించారు. అలాగే తన నియోజకవర్గం పరిధిలోనే విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ జరుగుతోందని, ఈ అక్రమ మైనింగ్ ను అడ్డుకోవాల్సిన అధికారులు లంచాలకు లొంగిపోయారని రావెల స్పష్టం చేశారు.
ఆలయం పడగొట్టింది...ప్లాట్లు వేసేందుకే
గుంటూరు నగర శివార్లలో ఉన్న స్వర్ణ భారతీనగర్ లో ఓంకార దేవాలయాన్ని రెవిన్యూ అధికారులు అక్రమ కట్టడం అంటూ కూల్చివేయడంతో స్థానికంగా వివాదానికి దారితీసింది. ఈ ప్రాంతం ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలో ఉండటంతో స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఘటనా స్థలాన్ని సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్వర్ణ భారతీ నగర్ ఆలయం కూల్చివేతకు కారణం ఇక్కడ ప్లాట్లు వేసి అమ్ముకునే ఆలోచనతోనేనని కుండబద్దలు కొట్టారు. కొందరి దుర్భుద్ది వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్రమ మైనింగ్...రావెల ఆకస్మిక తనిఖీ
అనంతరం గుంటూరు రూరల్ మండలం పొత్తూరు శివారు ఓబులునాయుడుపాలెం వద్ద నిర్వహిస్తున్న అక్రమ మైనింగ్ క్వారీలను ఎమ్మెల్యే రావెల బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సమయంలో అక్రమ మైనింగ్కు వినియోగిస్తున్న రెండు ప్రొక్లెయిన్లు, రెండు లారీలను పోలీసులకు అప్పగించారు. ఇలా తన నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకెళ్లానని, ఏడాది కాలంగా ఎన్నోసార్లు చెప్పినా పుల్లారావు ఆపలేక పోయారని రావెల కిషోర్బాబు చెప్పారు. అలాగే ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి సైతం తెచ్చినా అడ్డుకోలేకపోయారని తెలిపారు. గత ఏడాదిన్నర నుంచి రూ.100 కోట్లకు పైగా అక్రమ మైనింగ్ జరిగిందని ప్రకటించారు.
మంత్రి పుల్లారావు పై....ఆరోపణలు
ఈ అక్రమ మైనింగ్ ను అడ్డుకోవాల్సిన మైనింగ్, రెవిన్యూ, పోలీస్ అధికారులు లంచాలకు లొంగిపోయారని ఆయన ఆరోపించారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేరు చెబుతూ అశోక్,నారాయణ అనే వ్యక్తులు, అజయ్ అనే వ్యక్తి ద్వారా ఈ అక్రమ మైనింగ్ దందాను యధేచ్చగా నిర్వహిస్తున్నారని రావెల ఆరోపించారు. అదేమని స్థానికులు వారిని నిలదీస్తే మంత్రి పుల్లారావు పేరే చెబుతున్నారని, దీనివల్ల మంత్రికి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్నారు. అలాగే మిర్చియార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు కుమారుడు మన్నవ అనిల్ కూడా గతంలో ఇలాగే అక్రమంగా మైనింగ్ నిర్వహించారని, ఆ క్రమంలో అతనిపై కేసులు కూడా నమోదయ్యాయని రావెల చెప్పారు.
ముఖ్యమంత్రికి...ఫిర్యాదు...
అసలు తన నియోజకవర్గంలో ఇతర ప్రాంతాల నేతల జోక్యం ఏమిటో అర్ధం కావడం లేదని మాజీ మంత్రి రావెల వాపోయారు. తన నియోజకవర్గంలో అక్రమాలు జరుగుతుంటే అరికట్టడానికి అధికారులకు చెప్పినా ప్రయోజనం లేకపోవడంతో తానే పోరాడాల్సిన పరిస్థితి రావడం సిగ్గుచేటని రావెల వాపోయారు. తన నియోజకవర్గంలో అక్రమాల్లో బైటి వ్యక్తుల ప్రమేయం ఉందని, దీన్ని అరికట్టాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు రావెల తెలిపారు.