బిజెపిదే బాధ్యత: బాబుకూ మోదుగుల షాక్, రాహుల్కు తమ్ముళ్ల ఝలక్
ఏపీకి ప్రత్యేక హోదా అంశం ఇంతటితో వదిలేసేది కాదని, ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని మోదుగుల అన్నారు. ప్రత్యేక హోదా విషయమై ప్రధాని నరేంద్ర మోడీ చొరవ చూపాలన్నారు.
గుంటూరు: ఏపీలో కాంగ్రెస్ పార్టీ సభ విజయవంతమైనా, ఆ పార్టీ బలపడినా అందుకు బిజెపియే బాధ్యత వహించాలని టిడిపి ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆదివారం విమర్శలు గుప్పించారు.
ఏపీలో రాహుల్ పర్యటనను నిరసిస్తూ టిడిపి నేతలు, కార్యకర్తలు గుంటూరులో ఈ రోజు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా మోదుగుల మాట్లాడారు.
కాల్చి చంపేస్తారు: చంద్రబాబు-పవన్ కళ్యాణ్లపై జగన్ మామ తీవ్ర వ్యాఖ్య
హోదాను వదిలేది లేదు
ఏపీకి ప్రత్యేక హోదా అంశం ఇంతటితో వదిలేసేది కాదని, ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని మోదుగుల అన్నారు. ప్రత్యేక హోదా విషయమై ప్రధాని నరేంద్ర మోడీ చొరవ చూపాలన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజ్కు అధికార టిడిపి అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే పార్టీకి చెందిన మోదుగుల తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. హోదాకు మించిన ప్యాకేజీ ఇచ్చాని బిజెపి చెబుతోంది, హోదాకు మించిన ప్యాకేజీ ఇచ్చాం కాబట్టే అంగీకరించామని, హోదాతో లాభం లేదని టిడిపి నేతలు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో మోదుగుల.. హోదాను వదిలేది లేదని చెబుతు బిజెపికి, బాబుకు షాకిచ్చారు.
రాహుల్ను అడ్డుకునేందుకు వచ్చిన టిడిపి
గుంటూరు ప్రత్యేక హోదా సభలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ, అఖిలేష్ వచ్చారు. వారు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వారిని అడ్డుకునేందుకు టిడిపి కార్యకర్తలు విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్రాన్ని అడ్డంగా విభజించి, ఇప్పుడు హోదా కోసం సభను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. రాహుల్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
రాహుల్ ఫ్లెక్సీలకు నల్ల రంగు
ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ గుంటూరులో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ హాజరవుతున్నారు. రాహుల్కు ఆహ్వానం పలుకుతూ గన్నవరంలో ఆయన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. రాహుల్ రాకను నిరసిస్తూ ఆయన ఫ్లెక్సీలపై టిడిపి కార్యకర్తలు నల్లరంగు పోశారు. దీంతో, వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. టిడిపి కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.
కేఈ విమర్శలు
ఏపీలో పర్యటించే హక్కు రాహుల్ గాంధీకి లేదని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. రాష్ట్ర పునర్విభజన చేసి, ఏపీని కట్టుబట్టలతో పంపించి, ఇవాళ ఎలా ఉన్నారో చూసేందుకు వస్తున్నారా? పార్లమెంటులో రాహుల్ గాంధీ ఎప్పుడైనా ప్రత్యేక హోదాను ప్రస్తావించారా? అని ప్రశ్నించారు. అధికార కోసం కాంగ్రెస్ రాజకీయాలు చేసి నాడు రాష్ట్రాన్ని పునర్విభజించిందన్నారు. ప్రత్యేక హోదా అంటూ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని, ఈ రాష్ట్ర పర్యటన కేవలం రాజకీయ ప్రయోజనం కోసమేనని ఆరోపించారు.