సాక్షి పత్రికపై కాల్వ: ధైర్యం ఉందా అని జగన్ ప్రశ్న
హైదరాబాద్: సాక్షి దినపత్రికలో వచ్చిన లెక్కలను ప్రతిపక్ష నేత వైయస్ జగన్ రైతుల ఆత్మహత్యలంటూ చెబుతున్నారని, ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్న రైతుల జాబితా తమకు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు కాల్వ శ్రీనివాసులు అన్నారు. రుణమాఫీపై సోమవారం శాసనసభలో మాట్లాడుతూ ఆయన జగన్కు సవాల్ విసిరారు. రుణమాఫీ కాకపోవడం వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, నిరూపించలేకపోతే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రతిపక్ష హోదా వదులుకోవాలని ఆయన సవాల్ చేశారు.
దానికి వైయస్ జగన్ ధీటుగా స్పందించారు. దమ్ముంటే ఎన్నికలకు పోదామని ఆయన తెలుగుదేశం పార్టీకి సవాల్ విసిరారు. ఎన్నికలకు వెళ్లే ధైర్యం టిడిపికి ఉందా అని ఆయన అడిగారు. బినామీలకు రుణమాఫీ చేసే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని కాల్వ శ్రీనివాసులు అన్నారు. ప్రకృతి శాపానికి, కాంగ్రెసు పాలన తోడై రైతుల పరిస్థితి దిగజారిందని ఆయన అన్నారు.

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన అన్నారు. సెజ్ల పేరిట గతంలో రైతుల భూములు లాక్కున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు దేవుడితో సమానమని రైతులు అంటున్నారని ఆయన అన్నారు. ఎన్నికల మానిఫెస్టోను తుచ తప్పకుండా అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తప్పుడు లెక్కలు, అర్థ సత్యాలతో సభా సమయం వృధా చేశారని ఆయన అన్నారు. రుణమాఫీ అనేది ఆవేశంతో తీసుకున్న నిర్ణయం కాదని ఆయన స్పష్టం చేశారు. రైతులకు భరోసా ఇవ్వడానికి రుణమాఫీ చేశామని చెప్పారు. జగన్ చెప్పిందాంట్లో నిజం ఉంటే 86 మంది రైతుల పేర్లు ఇవ్వాలని, అన్యాయం జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఆయన అన్నారు.
జగన్కు ఓటేస్తే అరాచకాలు పెరిగిపోతాయని ప్రజలు భయపడ్డారని మంత్రి పల్లె రఘునాథ రెడ్డి అన్నారు. రైతులను మోసం చేయడం ఇష్టం లేకనే తాము రైతు రుణమాఫీకి హామీ ఇవ్వలేదని వైసిపి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ అన్నారు.












Click it and Unblock the Notifications