అదీ జరిగింది: ఎమ్మెల్యే సుగుణమ్మతో చంద్రబాబు భేటీ, టీటీడీకి సీఎం ఆదేశాలు
తిరుపతి: తెలుగుదేశం పార్టీ నేత, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ శుక్రవారం ఉదయం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం పట్టువస్త్రాలు సమర్పించే సమయంలో ఎమ్మెల్యే గైర్హాజరయ్యారైన విషయం తెలిసిందే.
చంద్రబాబుకు తిరుపతి ఎమ్మెల్యే ఝలక్!...సీఎం తిరుమల పర్యటనకు గైర్హాజరు
ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే లేకపోవడంపై ఆరా తీసిన ముఖ్యమంత్రి.. సుగుణమ్మను పిలిచి మాట్లాడారు. మహాసంప్రోక్షణ సమయంలో టీటీడీ అధికారులు తనకు సరైన గుర్తింపు ఇవ్వలేదని, ఆలయంలోనికి అనుమతించని కారణంగా తాను మనస్తాపం చెందినట్లు ఆమె సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
టీటీడీ అధికారులు తనకు సరైన గుర్తింపు ఇచ్చేవరకు ఆలయానికి రాకూడదని నిర్ణయించుకున్నట్లు సుగుణమ్మ చంద్రబాబు వివరించారు. భేటీ అనంతరం సుగుణమ్మ మీడియాతో మాట్లాడారు.
టీటీడీ అధ్యక్షుడు పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమక్షంలో ఆలయంలో జరిగే అన్ని కార్యక్రమాల్లో తనకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి అదేశించినట్లు సుగుణమ్మ తెలిపారు. దీంతో ఎమ్మెల్యే, టీటీడీ అధికారుల మధ్య వివాదం ముగిసినట్లయింది.