వల్లభనేని వంశీ రూటెటు: టీడీపీ వీడటం ఖాయమేనా..! సుజనాతో భేటీ వెనుక..!
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీని వీడే ఆలోచనలో ఉన్నారా. కొద్ది రోజుల క్రితమే ఇటువంటి ప్రచారం సాగినా..ఆయన తరువాత దానిని ఖండించారు. కానీ, ఒక వైపు టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునిస్తే..వంశీ మాత్రం బీజేపీ నేత సుజనా చౌదరితో సమావేశం కోసం ప్రత్యేకంగా గుంటూరు వచ్చారు. గతంలోనూ ఆయన సుజనాతో భేటీ అయ్యారు. ఆయనతో ఉన్న బంధుత్వం కారణంగానే సమావేశం అయ్యానని..బీజేపీలోకి వెళ్లే ఆలోచన లేదని చెప్పుకొచ్చారు.
ఏపీలో హాట్ టాపిక్ ..సీఎం జగన్ ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ .. ఎందుకంటే
కానీ, కొద్ది రోజులుగా వంశీ పార్టీలో క్రియా శీలకంగా వ్యవహరించటం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తాజాగా ఆయన మీద ఫోర్జరీ కేసు నమోదైంది. ఆ సమయంలో ఆయన తన కీలక అనుచరులతో సమావేశమయ్యారు. దీంతో..ఆయన పార్టీ మారే ఆలోచనలు చేస్తున్నారని ప్రచారం సాగింది. కానీ, వంశీ స్పందించలేదు. ఇప్పుడు సుజనాతో మరోసారి ప్రత్యేకంగా భేటీ అవ్వటం ద్వారా వంశీ ఇక టీడీపీలో ఉండటం అనుమానంగానే కనిపిస్తోందని పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.
సుజనాతో వంశీ సమావేశం
టీడీపీ నుండి బీజేపీలో చేరిన మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరితో టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భేటీ అయ్యారు. ఒంగోలు పర్యటనకు వెళ్తూ మధ్యలో సుజనా గుంటూరు వచ్చారు. వల్లభనేని వంశీ అక్కడకు వచ్చి ప్రత్యేకంగా సుజనాతో భేటీ అయ్యారు. తరువాత ఆయనతో కలిసి ఆయన కారులోనే ఒంగోలు వెళ్లారు. అయితే, ఈ మధ్య కాలంలో వంశీ ఈ విధంగా సుజనాతో భేటీ అవ్వటం రెండో సారి. ఒక వైపు టీడీపీ ఏపీలో ఇసుక కొరత..ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆందోళనలు నిర్వహిస్తోంది. ఇదే సమయంలో వంశీ పార్టీ ఆదేశాలను పక్కన పెట్టి..సుజనాతో మరో ప్రాంతానికి వచ్చి భేటీ అవ్వటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కొంత కాలంగా వంశీ టీడీపీ వీడుతారనే ప్రచారం సాగుతోంది. అయితే కొద్ది రోజుల క్రితం వంశీ ఆ ప్రచారాన్ని ఖండించారు. అయితే, తాజాగా ఆయన వేస్తున్న అడుగులు గమనిస్తే టీడీపీని వీడుతురానే ప్రచారానికి అవకాశం ఇచ్చేలా ఉన్నాయి.
కీలక అనుచరులతో భేటీ..
కొద్ది రోజుల క్రితం హనుమాన్ జంక్షన్ లో వంశీ మీద కేసు నమోదైంది. ఎన్నికల సమయంలో పేదలకు స్థాని ఎమ్మార్వో సంతకం ఫోర్జరీ చేసి నకిలీ ఇళ్ల పట్టాలు అందించారని ఫిర్యాదు అందింది. స్వయంగా తహసీల్దార్ ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేసారు. ఆ తరువాత వంశీ తన జన్మదినం నాడు గన్నవరం వస్తారని అంచనా వేసారు. కానీ, ఆయన రాలేదు. ఆ తరువాత వచ్చిన వంశీ తన కీలక అనుచరులతో రహస్య సమావేశం నిర్వహించారు. ఆ సమయంలోనే ఆయన టీడీపీ వీడి మరో పార్టీలోకి వెళ్లేందుకు అడుగులు వేస్తున్నారంటూ ప్రచారం మొదలైంది. ఆయన గతంలో ముఖ్యమంత్రి జగన్ ను సైతం కలిసారు. అయితే, తన నియోజకవర్గంలో సాగు నీటి సమస్య మీద కలిసానని వివరించారు. ఇక, కేసు నమోదైనా ఇప్పటి వరకు ఆయన వద్దకు పోలీసులు రాలేదు. దీంతో..వంశీ రాజకీయంగా కీలక నిర్ణయం దిశగా ఆలోచన చేస్తున్నారనే వాదన నియోజకవర్గంలో బలంగా సాగుతోంది.
బీజేపీలోకి వెళ్తారా..
గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వంశీ నిజంగా పార్టీ మారితే..ఏ పార్టీ లోకి వెళ్లే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. ఆయన ఏ పార్టీలోకి వెళ్లినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందుగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. దానికి వంశీ సిద్దంగా ఉన్నారా అనేది మరో కీలక అంశం. గతంలో టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. రాజీనామా చేయకుండా ఏ పార్టీలో చేరినా..అనర్హత వేటు వెంటాడే ప్రమాదం ఉంది. దీంతో..అసలు వంశీ టీడీపీ వీడుతారా..వీడితే ఏ పార్టీలోకి వెళ్తారు.. వెళ్లే ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా..ఇలా అనేక ప్రశ్నలు ఇప్పుడు గన్నవరం నియోజకవర్గంతో పాటుగా టీడీపీలో పెద్ద ఎత్తున చర్చకు కారణమయ్యాయి.