బెజవాడలో రోడ్డెక్కిన బాధితులు, మద్దతు పలికిన టిడిపి ఎమ్మెల్యే వంశీ
విజయవాడ: కృష్ణా జిల్లాలోని విజయవాడ నగరం రైవస్ కాలువ గట్టు పైన ఇల్లు నిర్మించుకొని ఉంటున్న స్థానికులు తమ ఇళ్లను తొలగించరాదంటూ ఆదివారం ఉదయం జాతీయ రహదారి పైన ఆందోళన నిర్వహించారు. వీరి ఆందోళనకు టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మద్దతు పలికారు.
ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం రైవస్ కాలువ గట్టు పైన ఉన్న 300 ఇళ్లను తొలగించేందుకు అధికారులు శనివారం రాత్రి నోటీసులు ఇచ్చారు. గతంలో కూడా ఇక్కడ కొన్ని ఇళ్లను తొలగించారు. ఫ్లై ఓవర్ నిర్మాణానికి ఇంకా స్థలం కావాల్సి ఉందని భావించిన అధికారులు మిగతా 300 ఏళ్లను తొలగించాలని నిర్ణయించారు.
దాంతో ఆగ్రహించిన స్థానికులు రోడ్డెక్కారు. ఈ ఆందోళనకు స్థానిక ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత వల్లభనేని వంశీ మద్దతుగా నిలబడ్డారు. పేదలు నిర్మించుకున్న ఇళ్లు తొలగించారదని డిమాండ్ చేశారు. బలవంతంగా చేయవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చెప్పారని గుర్తు చేశారు.
జాతీయ రహదారి పైన రాస్తా రోకో, వారికి టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మద్దతు పలకడంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, ఆందోళనకారులతో చర్చించారు.