టచ్ చేసి మాట్లాడొద్దు.. నీ సంగతేంటో చూస్తా: ఎస్ఐకి టీడీపీ ఎమ్మెల్యే వార్నింగ్
అక్కడే డ్యూటీలో ఉన్న ఎస్ఐలు మహేశ్వరరావు, లక్ష్మీనారాయణలు ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో 'ఏంటయ్యా.. నువ్వు చెప్పేది.. నేను ఎమ్మెల్యేను.. లోపలికి వెళ్తాను.. ఏం చేస్తావ్?' అంటూ ప్రశ్నించారు.
విశాఖపట్నం: ఎమ్మెల్సీ ఎన్నికల వేళ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ వ్యవహరించిన తీరు వివాదస్పదమవుతోంది. ఎమ్మెల్యే అన్న ట్యాగ్ ఉండటంతో పోలీస్ అధికారులపై ఆయన ఇష్టారీతిన వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. రూల్స్ పాటించాలని చెప్పినందుకు.. రివర్స్ లో పోలీసులకే ఆయన వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.
ఇంతకీ ఆయనేం చేశారంటే!.. గురువారం నాడు ఏవిఎన్ కాలేజీ వద్ద ఎమ్మెల్సీ పోలింగ్ జరుగుతున్న క్రమంలో టీడీపీ కార్యకర్తలు కొందరు పోలింగ్ బూత్ కు దగ్గరలో గుమిగూడి కనిపించారు. ఇది రూల్స్ కు విరుద్దమని పోలింగ్ కేంద్రానికి కనీసం 200మీ. పరిధిలో ఉండాలని అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు వారికి నచ్చజెప్పారు.
అయితే ఏకంగా కుర్చీలు వేసుకుని మరీ వారు అక్కడే మకాం పెట్టడంతో పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి వెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో ఆగ్రహించిన కార్యకర్తలు ఎమ్మెల్యేకు ఫోన్ కొట్టారు. ఆ వెంటనే అక్కడ ప్రత్యక్షమైపోయిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్.. పోలీసులపై చిర్రుబుర్రులాడారు.
ఇదే క్రమంలో 'సార్.. పార్టీ కండువా ధరించి పోలింగ్ బూత్ లోనికి రావద్దు' అంటూ ఎస్ఐ ఎమ్మెల్యేకు సున్నితంగా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎస్ఐ మాటలకు మరింత ఆగ్రహానికి లోనైన ఎమ్మెల్యే గణేశ్.. 'ఏం సురేష్.. ఈమధ్య చాలా ఎక్కువైంది.. నీ సంగతి చూస్తా' అని హెచ్చరించారు.
ఇంతలో ఎమ్మెల్యేను కూల్ చేయడానికి సదరు ఎస్ఐ ఆయనకు దగ్గరకు వెళ్లి.. షేక్ హ్యాండ్ ఇవ్వాలని ప్రయత్నించగా.. 'టచ్ చేయకు.. దూరంగా ఉండి మాట్లాడు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో పక్కనే ఉన్న ఏసీపీ నరసింహమూర్తి ఎమ్మెల్యేకు సున్నితంగా నచ్చజెప్పారు. 'సర్.. మీకు తెలియని రాల్సా.. కోఆపరేట్ చేయండి' అని అనడంతో గొడవ సద్దుమణిగినట్టయింది.
ప్రేమ సమాజం పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఇదే తంతు:
ప్రేమ సమాజం పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఎమ్మెల్యే గణేశ్ కుమార్ దూకుడుగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. సాయంత్రం 4.30గం. సమయంలో పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన ఆయన.. పోలింగ్ స్లోగా జరుగుతుందని తనకు ఫిర్యాదు అందిందని లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు.
దీంతో అక్కడే డ్యూటీలో ఉన్న ఎస్ఐలు మహేశ్వరరావు, లక్ష్మీనారాయణలు ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో 'ఏంటయ్యా.. నువ్వు చెప్పేది.. నేను ఎమ్మెల్యేను.. లోపలికి వెళ్తాను.. ఏం చేస్తావ్?' అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఆగ్రహానికి గురైన ఎస్ఐ లక్ష్మీనారాయణ 'మా డ్యూటీ మమ్మల్ని చేసుకోనివండి సార్.. అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేసుకోండి' అని బదులిచ్చాడు.
ఎస్ఐ సమాధానంతో 'చేస్తాను.. చూస్తాను.. లోపలికి వెళ్లకూడదని రూల్ ఏమైనా ఉందా.. ఎలక్షన్ ఆఫీసర్లతో మాట్లాడాలమ్మా..' అంటూ మళ్లీ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఎస్ఐలు మళ్లీ అడ్డుతగలడంతో రూల్స్ చెబుతున్నావేంటని ఎమ్మెల్యే రెచ్చిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అక్కడినుంచి వెనుదిరిగారు.