సీఎం జగన్ ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ .. అనుకున్నట్టుగానే !!
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే టిడిపి నేత వాసుపల్లి గణేష్ ఈరోజు మధ్యాహ్నం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. సీఎం జగన్ తో భేటీ అయిన ఆయన వైసీపీ పట్ల తన సానుకూలతను వ్యక్తం చేశారు. టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ బాటలో ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్న టిడిపి నేతలు ఒక్కొక్కరుగా సైకిల్ దిగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కూడా సీఎం జగన్ ను కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తన మద్దతును తెలియజేశారు.
ముఖ్యమంత్రిని కలిసిన వారిలో వాసుపల్లి గణేష్ తో పాటుగా, కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ , వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఉన్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు షాక్ ఇస్తూ టిడిపి నేతలు ఒక్కొక్కరుగా వైసిపి బాట పడుతున్నారు. చంద్రబాబు నాయుడు 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించటం, ముఖ్యంగా విశాఖను రాజధానిగా చంద్రబాబు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో విశాఖ జిల్లాలోని టిడిపి నేతలకు ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్నాయి. రాజకీయంగా విశాఖ జిల్లాలో మనుగడ సాగించాలంటే టీడీపీలో ఉంటే అది సాధ్యం కాదని భావిస్తున్న నేపథ్యంలోనే ఒక్కొక్కరుగా పార్టీని వీడి వెళుతున్నారు.
విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను వ్యతిరేకించిన చంద్రబాబు మాటలను వాసుపల్లి గణేష్ విభేదించారు. విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతించిన వాసుపల్లి గణేష్, వైసీపీ వైపు మొగ్గు చూపారు. అందులో భాగంగానే గత కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు . నేడు టీడీపీకి షాక్ ఇస్తూ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులతో పాటు సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశారు వాసుపల్లి గణేష్. వాసుపల్లి గణేష్ కుటుంబ సభ్యులు వైసీపీ కండువా కప్పుకోగా, ఆయన మాత్రం వైసిపికి మద్దతుగా కొనసాగాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో టిడిపిని వీడిన ఎమ్మెల్యేల బాటలోనే వాసుపల్లి గణేష్ కూడా నడుస్తున్నారు.