వైసీపీ ఎంపీ పుట్టిన రోజు వేడుకలకు టీడీపీ ఎమ్మెల్యే :రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ
ప్రకాశం జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ఒకపక్క కరణం బలరాం పైన ఆమంచి కృష్ణమోహన్ అగ్గిమీద గుగ్గిలం అవుతుంటే, అదే జిల్లాలో వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పుట్టినరోజు వేడుకలకు కరణం బలరాం హాజరవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఒంగోలులో జరిగిన బర్త్ డే వేడుకలకు టిడిపి ఎమ్మెల్యే కరణం బలరాం హాజరవడం ఆసక్తికరంగా మారింది.
ఈ కార్యక్రమానికి మంత్రి బాలినేనితో పాటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో పాటు టిడిపి ఎమ్మెల్యే కరణం బలరాం కూడా హాజరయ్యారు. అంతేకాదు పుట్టినరోజు వేడుకలకు ఆయన తన రాజకీయ వారసుడైన కరణం వెంకటేష్ ను కూడా తీసుకు వెళ్లారు. ఇక బర్త్ డే వేడుకల్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి ని శాలువాతో సత్కరించి కేక్ కట్ చేయించే వరకు అక్కడే ఉన్నారు టిడిపి ఎమ్మెల్యే కరణం బలరాం . అంతేకాదు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గురించి నాలుగు మంచి మాటలే ఆయన మాట్లాడారు కూడా.
కరణం బలరాం మాగుంట శ్రీనివాసులు రెడ్డి పుట్టినరోజు వేడుకలకు వెళ్లడానికి ఎలాంటి రాజకీయ కారణాలు లేనప్పటికీ స్థానికంగా మాత్రం పెద్ద చర్చ జరుగుతుంది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి తో టిడిపిలో పనిచేసిన సమయంలో మంచి సాన్నిహిత్యం ఉన్న కారణంగా కరణం బలరాం ఆయన పుట్టిన రోజు వేడుకలకు హాజరై నట్లుగా తెలుస్తుంది. గతంలో మాగుంట టిడిపిలో కొనసాగారు. ఎమ్మెల్సీ గా పని చేశారు. గత ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా గెలుపొందారు.రాజకీయాలను పక్కన పెట్టి తనతో సాన్నిహిత్యంతో మెలిగిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి పుట్టినరోజు వేడుకలలో జిల్లాలో ఓ సీనియర్ పొలిటీషియన్ గా కరణం బలరాం పాల్గొన్నారు.