టీడీపీ ఎమ్మెల్యేలు 23 మందా నలుగురా ? ఆ నలుగురు తప్ప మిగతా వారి మాటేంటి ?
పాండవులు ఎంతమందంటే .. మంచం కోళ్లలా.. ముగ్గురు అంటు రెండు వేళ్లు చూపించి ఒక్కటి రాసినట్లుంది టీడీపీలో పరిస్థితి..ఏపీ ఎన్నికల్లో టిడిపి ఘోర ఓటమి పాలైంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను ఇరవై మూడు స్థానాలకే టిడిపి పరిమితమైంది. అయినప్పటికీ ప్రస్తుతం ఏపీ లో ఒక ఆసక్తికర చర్చ జరుగుతోంది. టిడిపి ఎమ్మెల్యేలు 23 మందా.. లేక నలుగురా అని.. అదేంటి.. టిడిపి నుండి ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ ఫిరాయించలేదే.. అలాంటప్పుడు నలుగురు ఎలా ఉంటారు అని ఆలోచిస్తున్నారా.. అయితే ఇప్పుడు జరుగుతున్న చర్చ పార్టీ ఫిరాయింపుల చర్చ కాదు. అసెంబ్లీ వేదికగా టిడిపి ఎమ్మెల్యేలు నలుగురు మాత్రమే కనిపిస్తారు. వారి గొంతు మాత్రమే వినిపిస్తోంది. చంద్రబాబు కు బాసటగా ఒక ముగ్గురు మాత్రమే నోరు ఎత్తుతున్నారు. మరి మిగతా వారందరికి ఏమైంది అన్నదే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్.
ఏపీ అసెంబ్లీలో టీడీపీ నుండి మాట్లాడుతుంది నలుగురు మాత్రమే
టిడిపి ఎమ్మెల్యేలు 23 మంది. చంద్రబాబు కాకుండా 22 మంది ఉండాలి. అధికారం కోల్పోయిన, ప్రతిపక్ష హోదాలో ఉన్న నేతలుగా వీరంతా అసెంబ్లీ వేదికగా తమ గళాన్ని వినిపించాలి . ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలి . కానీ ఏపీ అసెంబ్లీ లో వైసిపి మాటల దాడిని కానీ, ప్రజా సమస్యలపైన ప్రస్తావన కానీ చేస్తుంది ఆ నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే . ప్రతిపక్ష నేత చంద్రబాబు తో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే అసెంబ్లీ వేదికగా తమ వాణిని వినిపిస్తున్నారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో చంద్రబాబు పార్టీని ఇరకాటంలో పెట్టేలా అధికార పార్టీ నేతల మాటల దాడులు సాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అంతా అవినీతి జరిగిందంటూ శాఖల వారీగా చంద్రబాబు పై విరుచుకు పడుతున్నారు వైసిపి మంత్రులు. ఇక ఏకంగా సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నే టార్గెట్ చేసుకొని అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
Recommended Video
టీడీపీలో ఎమ్మెల్యేలుగా కీలక నేతలున్నా సభలో మాట్లాడని వైనం .. ఏపీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్
వైసిపి దాడిని తట్టుకుని ఎదురు దాడి చేయడానికి టిడిపి నుండి చంద్రబాబు కు బాసటగా ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే కీలకంగా వ్యవహరిస్తున్నారు. అచ్చె నాయుడు, నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే అధికార పార్టీ పైన ఎదురుదాడి చేస్తున్నారు. వైసిపి విమర్శలను ధీటుగా ఎదుర్కొంటూ, వాటిని తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక పయ్యావుల కేశవ్, కరణం బలరాం అంటి సీనియర్ నాయకులు టీడీపీలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వెలగపూడి రామకృష్ణ, వల్లభనేని వంశీ వంటి దూకుడు చూపించగలిగిన నేతలు ఉన్నారు. ఇక చంద్రబాబు బామ్మర్ది నందమూరి బాలకృష్ణ సైతం హిందూపురం ఎమ్మెల్యేగా అసెంబ్లీ కి వస్తున్నారు. కానీ వీరిలో ఎవరు వైసీపీ పై గట్టిగా ఎదురు దాడి చేయడానికి కాని, విమర్శలు చేయడానికి కాని సాహసించడం లేదు. టిడిపి అధినేత చంద్రబాబుకు బాసటగా నిలవడం లేదు.
టీడీపీ , వైసీపీ దాడికి ఎదురు దాడి చెయ్యాల్సిన నేతలు సైలెంట్ .. అందుకే ఏపీలో చర్చ
కేవలం అచ్చెనాయుడు, నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాత్రమే గట్టిగా వైసిపి పైన ఎదురుదాడి చేస్తున్నారు. ఈ ముగ్గురు మినహాయించి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మిగతా టిడిపి సభ్యులు ఎవరు యాక్టివ్ గా లేకపోవడంతో రాష్ట్ర రాజకీయ వర్గాలలో ఆ నలుగురు తప్పించి మిగతా టిడిపి ఎమ్మెల్యేలకు ఏమైంది అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఎందుకు వీరంతా సైలెంట్ గా ఉంటున్నారు అన్న చర్చ ఊపందుకుంది. వైసిపి , టీడీపీ నేతల పై చేస్తున్న దాడిని గట్టిగా తిప్పికొట్టాలంటే ఉన్న 23 మంది సమర్థవంతంగా పని చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆ పని జరగడం లేదన్న భావన టీడీపీ శ్రేణుల్లో వ్యక్తం అవుతుంది . టిడిపి హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలు సైతం ఇప్పుడు సభలో రాద్ధాంతం జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఏదేమైనప్పటికీ తక్కువ మంది సభ్యులతోనూ టిడిపి గట్టిగా నిలదొక్కుకోవాలంటే ముక్తకంఠంతో అధికార వైసిపి పైన పోరాటం చేయాల్సిందే. లేదంటే టిడిపి ఎమ్మెల్యేలు ఎంతమంది అనే చర్చ ఇలాగే ఎప్పటికీ రాజకీయ వర్గాల్లో ఇలాగే కొనసాగే పరిస్థితి ఉంది .