ఇలాంటి టైమ్లో చంద్రబాబు లేకపోవడం బాధాకరం.. టీడీపీ అధినేతపై ఆ పార్టీ ఎమ్మెల్యేల సెటైర్లు
ఆసక్తికరంగా సాగుతోన్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రెండోరోజైన మంగళవారం ఎస్సీల కోసం మూడు కార్పొరేషన్లు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ల ఏర్పాటుతోపాటు అమ్మఒడి పథకంపైనా చర్చ జరిగింది. సొంతపార్టీపై తిరుగుబాటు చేసిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు ఈ చర్చలో అవకాశం లభించింది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు(పశ్చిమ)ఎమ్మెల్యే మద్దాలి గిరి సభలో 'అమ్మఒడి' పథకంపై మాట్లాడుతూ సీఎం జగన్ పై పొగడ్తలు కురిపించారు. అదే సమయంలో తమ పార్టీ చీఫ్ చంద్రబాబుపై సెటర్లు వేశారు.
రాష్ట్రంలో అమ్మ ఒడి పథకం పెద్ద గేమ్ చేంజర్ అని, భావితరాలను దృష్టి లో ఉంచుకునే సీఎం జగన్ ఈ పథకాన్ని రూపొందించారని ఎమ్మెల్యే వంశీ అన్నారు. పేదలందరూ తమ పిల్లల్ని ఇక నిర్భయంగా బడులకు పంపుతారని, దీని వల్ల డ్రాపౌట్స్ తగ్గిపోతాయని చెప్పారు. విప్లవాత్మకమైన అమ్మఒడి పథకం దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అయితే, ఇంత గొప్ప పథకానికి పార్టీ పరంగా టీడీపీ మద్దతు ఇవ్వకపోవడం దారుణమని, వ్యక్తిగతంగా తాను మాత్రం దీనికి మద్దతు ఇస్తానని వంశీ తెలిపారు.
పేదలు, బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేక్రమంలో భాగంగా సీఎం జగన్ ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం నిజంగా అంత్యంత పవిత్రమైనదని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరి అన్నారు. ప్రజలకు మంచి చేసే పథకాల విషయంలో పార్టీలను, రాజకీయాలను పక్కనపెట్టి చూడాలని సూచించారు.
అమ్మ ఒడి పథకానికి టీడీపీ మద్దతు ఇవ్వకపోవడంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలైన వంశీ, గిరి అసంతృప్తి వ్యక్తం చేశారు. ''ఇంత గొప్ప పథకంపై ఇంత చక్కగా చర్చ జరుగుతున్న సమయంలో చంద్రబాబు ఇక్కడ లేకపోవడం బాధాకరం. టీడీపీ ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించకపోవడం ఇంకా దారుణం. ఇకనైనా మంచికి సహకరించే అలవాటును చంద్రబాబు అలవర్చుకుంటే మంచిది''అని టీడీపీ ఎమ్మెల్యేలు అన్నారు.