టీడీపీ ఎమ్మెల్యేల రివర్స్ టెండర్: వైఎస్ జగన్పై ప్రివిలేజ్ నోటీస్: పక్కదారి పట్టించేలా
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ప్రివిలేజ్ నోటీస్ను దాఖలు చేశారు. సభ హక్కుల ఉల్లంఘన కింద ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సభను పక్కదారి పట్టించేలా వైఎస్ జగన్ వ్యవహరించారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయట్లేదని, నిండుసభలో వాటికి విరుద్ధమైన ప్రకటనలను గుప్పించారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చర్యలు సభా హక్కుల ఉల్లంఘన కిందికి వస్తాయని పేర్కొన్నారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ కార్యాలయానికి ప్రివిలేజ్ నోటీస్ను దాఖలు చేశారు.
వడ్డీ లేని రుణాలపై సభను పక్కదారి పట్టించేలా..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్..ప్రతిపక్ష నేత హోదాలో నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా ఇచిన హామీల్లో ఒకటి.. వడ్డీ లేని రుణాలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు, మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాల మేరకు వైఎస్ జగన్ సారథ్యంలోని ప్రభుత్వం వడ్డీ లేని రుణాల పథకాన్ని అమలు చేయట్లేదనేది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల ఆరోపణ. ఇదే అంశాన్ని వారు ఈ ప్రివిలేజ్ నోటీస్లో పొందుపరిచారు. వడ్డీ లేని రుణాలపై వైఎస్ జగన్.. గత ఏడాది జులై 11వ తేదీన సభలో ఇచ్చిన సమాచారం మేరకు అమలు చేయట్లేదని ఆరోపించారు.
ఒక్క రూపాయి కూాడా..
వడ్డీ లేని రుణాల పథకం కింద వైఎస్ జగన్ ప్రభుత్వం ఒక్క రూపాయిని కూడా మంజూరు చేయలేదని టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇదివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో అమలు చేసిన ఈ పథకాన్ని కొనసాగించట్లేదని పేర్కొన్నారు. 2011 నుంచి 2019 వరకు ఈ పథకంపై సభలో ప్రస్తావించిన అంశాలు, చర్చకు వచ్చిన విషయాలను సభ సమక్షంలో ఉంచాలని కోరారు. ఈ మేరకు రికార్డులను పరిశీలించాలంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు డిామండ్ చేసినప్పటికీ.. అధికార పార్టీ పట్టించుకోలేదని, సభను వాయిదా వేశారని పేర్కొన్నారు.
ఎనిమిదేళ్ల కాలానికి సంబంధించిన రికార్డులు..
వడ్డీ లేని రుణాలపై 2011 నుంచి 2019 వరకు సభలో చర్చించిన అంశాలు, నమోదు చేసిన రికార్డులన్నింటినీ సభ సమక్షంలో ఉంచాలని టీడీపీ ఎమ్మెల్యేలుు విజ్ఞప్తి చేశారు. ఎవరు సభను పక్కదారి పట్టిస్తున్నారనేది దీనితో తేలిపోతుందని అన్నారు. ఈ ప్రివిలేజ్ నోటీస్పై టీడీపీ సభా పక్ష ఉప నేత కింజరాపు అచ్చెన్నాయుడు (టెక్కలి), ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి భవానీ (రాజమండ్రి సిటీ), పీజీవీఆర్ నాయుడు (విశాఖ వెస్ట్), బెందాళం అశోక్ (ఇచ్ఛాపురం) సంతకాలు చేశారు. అంతకుముందు- కాకాణి గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన ప్రివిలేజ్ కమిటీ సమావేశమైంది. ఈ భేటీ ముగిసిన వెంటనే వారు వైఎస్ జగన్పై ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చారు.