ఇవాళ కూడా అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్- ఈసారి ఏడుగురు...
ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన మొదటిరోజు 13 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ కాగా.. రెండోరోజు ఓ ఎమ్మెల్యే, మూడో రోజు 9 మంది ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారన్న కారణంతోనే వీరిపై సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. ఇవాళ కూడా అదే పరిస్ధితి చోటు చేసుకుంది.
ఏపీ అసెంబ్లీలో ఇవాళ సంక్షేమ పథకాలపై చర్చ జరుగుతోంది. ఇందులో ముందుగా పింఛన్ల పెంపుపై జరిగిన చర్చ రచ్చకు దారి తీసింది. టీడీపీ ఎమ్మెల్యే రామనాయుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడంలో తడబడిన అధికార పక్షం.. చివరికి ఆయనకు ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు వచ్చే ఏడాది పించన్ల పెంపు ఉంటుందని ప్రకటించి బయటపడింది. ఆ తర్వాత కూడా మిగతా సంక్షేమ పథకాలపై చర్చ జరుగుతున్న సమయంలో టీడీపీ సభ్యులు పదే పదే సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిందారు.
Recommended Video
అసెంబ్లీలో అధికార వైసీపీ తమ హయాంలో సంక్షేమం జరగలేదని చెప్పడాన్ని ఆక్షేపిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. వారిని తమ స్ధానాల్లో కూర్చోవాలని స్పీకర్ పదేపదే సూచించినా టీడీపీ సభ్యులు శాంతించలేదు. చివరికి ఏడుగురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని స్పీకర్ ఆమోదించారు.. సస్పెండైన టీడీపీ సభ్యుల్లో అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బాల వీరాంజనేయస్వామి, వెలగపూడి రామకృష్ణ బాబు, మంతెన రామరాజు, అనగాని సత్యప్రసాద్ ఉన్నారు.