వివేకా హత్యకేసు విచారణలో కొత్త ట్విస్ట్: కేసు విచారణ సీబీఐకి ఇవ్వాలి: టీడీపీ ఎమ్మెల్సీ పిటీషన్..!
మాజీ మంత్రి వైయస్ వివేకా హత్య కేసు విచారణలో కొత్త ట్విస్ట్. సిట్ విచారిస్తున్న ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్సీ హైకోర్టును ఆశ్రయించారు. కడప జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఈ మేరకు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఎన్నికల సమయంలో వైయస్ వివేకా పులివెందులలో తన నివాసంలో హత్యకు గురయ్యారు. ఆ వెంటనే ఆయన పీఏతో పాటుగా డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. దీని మీద రాజకీయంగా అనేక ఆరోపణలు వచ్చాయి. జగన్ కటుుంబ సభ్యుల మీద ప్రతిపక్షాలు రాజకీయంగా విమర్శలు చేసాయి.
ఇక, హత్య జరిగిన వెంటనే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సిట్ ఏర్పాటు చేసారు. అయితే, దీని పైన నిష్పక్ష విచారణ కోసం సీబీఐకు అప్పగించాలని అప్పట్లో వైసీపీ నేతలతో పాటుగా వివేకా కుటుంబ సభ్యులు సైతం డిమాండ్ చేసారు. అయితే, ఇప్పుడు ఏకంగా టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఇప్పటికే ఇదే కేసులో సిట్ విచారణ ఎదుర్కొన్నారు. ఆయనే ఇప్పుడు హైకోర్టులో సీబీఐ విచారణ కోరుతూ పిటీషన్ దాఖలు చేసారు.
ఇదే కేసులో సిట్ బిటెక్ రవిని సైతం విచారించింది. సిట్ నోటీసులు ఇవ్వటంతో విచారణకు హాజరైన బిటెక్ రవి..తన వాదన వినిపించారు. ఇక, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సైతం గురువారం సిట్ ముందు హాజరై తాను వివేకా హత్య జరిగిన సమయంలో విజయవాడలో ఉన్న విషయాన్ని గుర్తు చేసారు. వివేకా హత్యతో తనకు ఏ మాత్రం సంబంధం ఉన్నా..పులివెందులలో ఉరి వేయాలని..ఎన్ కౌంటర్ చేయాలని కోరారు.
ఇదే సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ ఇదే హత్య మీద సీబీఐ విచారణ అడిగి..ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తరువాత సిట్ విచారణ ఎందుకు చేయిస్తున్నారని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో ఇంటి దొంగలు ఎవరో అందరికీ తెలుసంటూ వ్యాఖ్యానించారు. ఇక, ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రిని సైతం సిట్ విచారించింది. ఈ కేసును సాధ్యమైనంత త్వరగా విచారించి..దోషులను బయట పెట్టాలని ముఖ్యమంత్రి నేరుగా డీజీపీని ఆదేశించారు. అయితే, టీడీపీ ఈ కేసులో వ్యూహాత్మకంగానే సీబీఐ విచారణ కోరుతూ రవి ద్వారా హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయించింది.
వివేకా హత్య కేసును సీబీఐ కి విచారణ నిమిత్తం అప్పగించాలనే బీటెక్ రవి పిటీషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిని తదుపరి విచారణ కోసం ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. ఇక, ఇప్పుడు ఈ ఎపిసోడ్ పైన వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.