జగన్ సలహాదారులెక్కడ ? 45 మంది పనేంటి ? -టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ప్రశ్న
ఏపీ సీఎం వైఎస్ జగన్ కు 41 మంది సలహాదారులు అవసరమా అంటూ హైకోర్టు వేసిన ప్రశ్న విపక్షాలకు వరంగా మారింది. గతంలో భారీ ఎత్తున నియమించిన జగన్ సలహాదారులపై విమర్శలు గుప్పించిన విపక్ష టీడీపీ.. ఇప్పుడు హైకోర్టు విమర్శలతో మరోసారి ఈ వ్యవహారాన్ని సాకుగా చూపుతూ వైసీపీని టార్గెట్ చేస్తోంది.
ఇదే క్రమంలో హైకోర్టు తీర్పుపై స్పందించిన టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు.. వైసీపీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. ఆర్టీఐ కింద అడిగిన సమాచారానికి, 45మంది సలహాదారు లున్నట్లు ప్రభుత్వం సమాధానంచెప్పిందని,. వారంతా ఏంచేస్తున్నారని అశోక్ బాబు ప్రశ్నించారు. ఎవరికి ఉపయోగపడుతున్నారంటే సమాధానం లేదని, ముఖ్యమంత్రి రీసోర్స్ మొబిలైజేషన్ సలహాదారుగా సుభాష్ చంద్ర్ ఉన్నారని, రీసోర్స్ మొబిలైజేషన్ కి సలహాదారులేంటి. ఆయన సలహాప్రకారమే ప్రభుత్వం ప్రజలకు ఇసుక దొరక్కుండా చేస్తుందా, పన్నులు వేస్తోందా అని అశోక్ బాబు ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వంలో 25మంది మంత్రులు, దాదాపు 35మందివరకు ప్రిన్సిపల్ సెక్రటరీలున్నారని, వారి తోపాటు ఐఏఎస్ లు, ఐపీఎస్ లున్నారని, వీరంతా విధి నిర్వహణలో, ప్రభుత్వపాలనలో మంచి అనుభవజ్ఞులేనని అశోక్ బాబహు తెలిపారు. వారిని మించి ఇంకా అద్భుతమైన పరిజ్ఞానం, పరిణితి ఉంటేనే సలహాదారులుగా నియమించాలని, కానీ ప్రభుత్వం సాక్షి మీడియాలోపనిచేసిన సజ్జలరామకృష్ణారెడ్డి, అమర్, శ్రీరామ్, కృష్ణమోహన్ లను సలహాదారులుగా నియమించిందని అశోక్ బాబు విమర్శించారు.. అసలు వారికున్న అనుభవం ఏమిటని అశోక్ బాబు ప్రశ్నించారు. మీడియాలో పనిచేసిన వారికి కేబినెట్ హోదా ఇచ్చి, ప్రభుత్వసలహాదారు గా నియమిస్తే, ప్రభుత్వానికి, ప్రజలకు ఒరిగేదేమిటన్నారు.
జగన్ తన అనుమాయులు, అనుచరుల్ని మాత్రమే కేబినెట్ హోదాలో సలహాదారులుగా నియమించారని, అంత హంగు, ఆర్భాటం వారికిచ్చినా కూడా వారెక్కడున్నారో, ఏంచేస్తున్నారో ఎవరికీ తెలియదని అశోక్ బాబు విమర్శించారు. వారంతా ఎవరు..దేనికి ఉన్నారు? వారిలో కొందరు ఢిల్లీలో ఉంటే, మరికొందరు విదేశాల్లోఉన్నారు. మరికొందరేమో అసలురాష్ట్రానికి సంబంధించినవారే కాదు. మిడిల్ ఈస్ట్ దేశాలకుచెందినవారు. వారంతా ఎక్కడెక్కడో ఉండేవారయితే, వారిసలహాలు, సూచనలు ఈప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఏం ఉపయోగపడుతున్నాయని అశోక్ బాబు ప్రశ్నించారు.