అడ్డంగా దొరికిన జగన్ -పోస్కోతో డీల్ బయటపెట్టిన కేంద్రం -విశాఖ స్టీల్ ప్లాంట్పై టీడీపీ ఫైర్
ఆంధ్రప్రదేశ్కు తలమానికంగా, దేశంలోనే పేరెన్నిక గల ప్రభుత్వరంగ సంస్థగా కొనసాగుతోన్న విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు చేతికి అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్లాంట్ ఉద్యోగులు, ప్రజాసంఘాలు, విశాఖ ఉక్కు పరిరక్షణ సమితితోకలిసి దాదాపు అన్ని పార్టీల నాయకులు గడిచిన వారం రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నారు. ప్రైవేటీకరణను నిలిపేయాలంటూ అధికార వైసీపీ సైతం పోరాటంలోకి దిగినవేళ.. పార్లమెంటు సాక్షిగా స్టీల్ ప్లాంటుపై కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన ఏపీ రాజకీయాలను కేదిపేసింది..
కేంద్రం ఏం చెప్పిందంటే..
విశాఖ స్టీల్ ప్లాంటు భూముల్లో దక్షిణ కొరియా సంస్థ పోస్కో ఏర్పాటు చేయబోయే గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్, అందులోని భాగస్వాములెవరు తదితర వివరాలు చెప్పాలంటూ వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్లో పోస్కో ప్లాంట్ ఏర్పాటు కాబోతున్నట్లు స్పష్టం చేసిన కేంద్ర మంత్రి.. పోస్కో ప్లాంట్ కోసం విశాఖ స్టీల్ ప్లాంట్తో 2019 అక్టోబర్లో ఒప్పందం కుదిరిందని, ఆ ఒప్పందం తర్వాత ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ను కూడా పోస్కో ప్రతినిధులు కలిశారని తెలిపారు. అంతేకాదు..
పోస్కో ప్లాంటులో సర్కారు వాటా తెలీదు..
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ఇప్పటికే 3 సార్లు పోస్కో బృందం సందర్శించిందని, పోస్కో, ఆర్ఐఎన్ఎల్ మధ్య భూముల అప్పగింతకు ఒప్పందం కుదిరిందన్న కేంద్ర మంత్రి.. పోస్కో ప్లాంట్ ఏర్పాటుకు జాయింట్ వర్కింగ్ గ్రూప్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాగా, కొత్తగా ఏర్పాటుకాబోయే గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్లో పోస్కో వాటా 50 శాతంగా ఉంటుందని, ఆర్ఐఎన్ఎల్(ప్రభుత్వం) వాటా ఎంత అనేది ఇంకా నిర్ణయించలేదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ వీధి పోరాటాలకు దిగిన వేళ.. ఆ వ్యవహారం ఏపీ సీఎంకు మూడేళ్లుగా తెలుసంటూ కేంద్ర మంత్రి చెప్పడం రచ్చకు దారితీసింది. దీనిపై..
జగన్ డీల్ బట్టబయలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ పై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంతో జగన్ పార్టీ అడ్డంగా దొరికిపోయినట్లయిందని, విశాఖ సహా ఏపీ ప్రజల్ని ఆ పార్టీ మోసం చేస్తోన్న తీరు గుట్టురట్టైందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకయ్య అన్నారు. ''మైక్ ముందు కారాగారం అంటూ ఎన్ని పోసుకోలు కబుర్లు చెప్పినా పోస్కో కంపెనీతో కలిసి జగన్ రెడ్డి చేసుకున్న డీల్ బయటపడకుండా ఆగదు సాయిరెడ్డి.. స్టీల్ ప్లాంట్ అమ్మకం ప్లానింగ్ అంతా మీ స్కెచ్ ప్రకారమే జరుగుతోందని స్వయంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రాజ్యసభ సాక్షిగా బయటపెట్టారు..'' అని ఫైరయ్యారు. ఇక..
అడ్డంగా దొరికిన వైసీపీ..
విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్లో పోస్కో కంపెనీ ఏర్పాటు, ఆర్ఐఎన్ఎల్-పోస్కో మధ్య ఒప్పందం, జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు, ఆ తరువాత ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని కలిసి డీల్ ఒకే చేసుకోవడం అన్నీ విషయాలు ఆన్ రికార్డ్ బయటపడ్డాయని, కేంద్రం ప్రకటనలతో వైసీపీ ముఖ్యులు అడ్డంగా దొరికిపోయారని టీడీపీ నేత వెంకన్న ఆరోపించారు. ఇక స్టీల్ ప్లాంట్ ముందు వైకాపా డ్రామాలు ఆపి ప్రజల్ని క్షమాపణ కోరాలని, విశాఖ ఉక్కు ని తుక్కు రేటుకి కొట్టేయాలి అనుకుంటున్న మిమ్మల్ని ప్రజలు తరిమికొట్టడం ఖాయమని సీఎం జగన్, ఎంపీ సాయిరెడ్డిలపై బుద్ధా మండిపడ్డారు. అంతకుముందు, విశాఖలో ప్రెస్ మీట్ లోనూ బుద్దా ఈ అంశంపై కీలక ఫొటోలను ప్రదర్శించారు. విశాఖ ఉక్కుపై కన్నేసిన పోస్కో బృందం 2019లో ఓసారి, 2020 లో ఓసారి తాడేపల్లిలో జగన్ను కలిసి చర్చలు జరిపిందంటూ ఫొటోలు ప్రదర్శించారు.
దేవుడు గొప్పోడు.. సాయిరెడ్డితో నిజం కక్కించాడు -ఇక వైసీపీ బంగాళాఖాతంలోకే: ఎంపీ రఘురామ