'దేహి అంటూ కేసీఆర్ వద్దకు.. జగన్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది'
మూడు రాజధానులు,శాసనమండలి రద్దు నిర్ణయాలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్,వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిలపై మరోసారి విమర్శలు గుప్పించారు. క్షుద్రపూజలకు బ్రాండ్ అంబాసిడర్ అంటూ విజయసాయి రెడ్డిని విమర్శించారు. 'గతంలో జగన్ ముఖ్యమంత్రి కావాలని క్షుద్ర పూజలు చేయించావు. ఇప్పుడు ఆయన తీసుకున్న మూడు ముక్కలాట గట్టెక్కాలని కాళహస్తి దేవాలయంలో క్షుద్ర పూజలు చేయించావు.' అంటూ ట్విట్టర్ వేదికగా విజయసాయిపై విమర్శలు చేశారు.
జనం ఇదే లాస్ట్ ఛాన్స్ అంటున్నారు : బుద్దా వెంకన్న
ఎన్ని చేసినా వైసీపీ ప్రభుత్వ చెత్త నిర్ణయాలకు దైవం అడ్డుపడిందని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. మండలి రద్దు బిల్లును పార్లమెంటులో వీలైనంత త్వరగా పాస్ చేసుకోవడానికి కలలు కంటున్నావు అంటూ జగన్పై విమర్శలు చేశారు. ఒక ప్రణాళిక అంటూ లేకుండా అభివృద్ది వికేంద్రీకరణ పేరుతో మొదలుపెట్టిన మూడు ముక్కలాట గురించి ప్రజలకు తెలిసిపోయిందని అన్నారు. అందుకే అన్నకు ఇచ్చిన ఒక్క ఛాన్సే ఆయనకు లాస్ట్ ఛాన్స్ అంటున్నారని ఎద్దేవా చేశారు.
చేసేవి చెత్త పనులు.. వాటికి జైకొట్టాలని..
చేసే చెత్త పనులకు జై కొట్టాలని జగన్, మీరు కలిసి ప్రధాని మోదీ, అమిత్ షాల కాళ్లుమొక్కడం అందరూ చూసారని విజయసాయిని బుద్దా వెంకన్న విమర్శించారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ హడావిడి చేసిన కేసీఆర్ దగ్గరకు మరోసారి దేహి అని వెళ్లారని విమర్శించారు. మండలి రద్దుకి సహకరించాలని ఫెడరల్ ఫ్రంట్ అధ్యక్షుడిని వేడుకుంటున్నారని పేర్కొన్నారు.
కుడితిలో పడ్డ ఎలుకలా జగన్..
శాసనమండలి రద్దుతో చంద్రబాబు సంకటంలో పడ్డారన్న వైసీపీ విమర్శలను బుద్దా వెంకన్న కొట్టిపారేశారు.
ఒకవేళ చంద్రబాబుకే సంకటం ఏర్పడితే.. తమరు ఢిల్లీ ఎందుకు వెళ్లినట్టు అని విజయసాయిని ప్రశ్నించారు. బిల్లు సంకటంలో పడి కుడితిలో పడ్డ ఎలుకలా జగన్ కొట్టుకుంటున్నారని విమర్శించారు. అందుకే కేంద్రం పెద్దల కాళ్లు పట్టుకోవడానికి జగన్ మిమ్మల్ని ఢిల్లీకి పంపించారని విజయసాయిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
పాత్రికేయ విలువల గురించి మాట్లాడుతున్నారా..?
వైఎస్ జగన్,విజయసాయి పత్రికలు,పాత్రికేయ విలువల గురించి మాట్లాడితే నవ్వొస్తుందన్నారు బుద్దా వెంకన్న. ప్రజాధనాన్ని దోచుకుని ఘనంగా బ్లాక్ పేపర్,ఛానల్ నిర్వహిస్తున్న మీరు ఇతర పత్రికలు,ఛానల్స్ ఏమి రాయాలో చెబుతున్నారా? అని ప్రశ్నించారు. అవాస్తవాలు,అసత్యాలు,అభూత కల్పనలు తప్ప సత్యం అనే అర్ధమే తెలియని బ్లాక్ పేపర్, ఛానల్ గురించి మీరు గొప్పలు చెప్పడమేంటని విమర్శించారు. ఇక మరో ట్వీట్లో ప్రభుత్వ సలహాదారు సజ్జల చేసిన వ్యాఖ్యలకు బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. 17 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని సజ్జల వారు సెలవిచ్చారని.. కానీ అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానం సమయంలో30 మంది ఎమ్మెల్యేలు ఎలా మాయమయ్యారు అని ప్రశ్నించారు.